ఓటు నమోదుకు మరో అవకాశం

ABN , First Publish Date - 2020-08-11T15:29:21+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం. ప్రజల చేతిలో..

ఓటు నమోదుకు మరో అవకాశం

సామర్లకోట(తూర్పు గోదావరి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం. ప్రజల చేతిలో వజ్రాయుధం. ఎవరిని గద్దెనెక్కించాలన్నా, దించాలన్నా ఓటుతోనే సాధ్యం. దీంతో ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతోంది. గతేడాది అక్టోబరు 31 వరకు ఓటర్ల నమోదు నిర్వహించారు. తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫోటో ఓటర్ల జాబితా సవరించిన షెడ్యూల్‌ను, పోలింగ్‌ కేంద్రాల పునర్వవ్యవస్థీకరణ అభ్యంతరాలపై దరఖాస్తుకు, పరిష్కారాల సవరణ జాబితా ముసాయిదా ప్రకటన, తుది జాబితా ప్రకటన వంటి అంశాలపై ఎన్నికల సంఘం రెవెన్యూ అధికారులకు సోమవారం ఆదేశిలిచ్చింది.


జనాభాకు అనుగు ణంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదు కావల్సి ఉంది. గతంలో ప్రకటించిన డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ ప్రకారం జనాభా ప్రాతిపదికన 75 శాతం ఓటర్లు ఉండాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. జనాభా ప్రకారం పరిశీలిస్తే 18-19 మధ్య వయస్సు ఉన్న ఓటర్లు మినహా మిగిలినవారు సరిపోతున్నారు. 18-19 మధ్య వయస్సుల ఓటర్ల నమోదులో వ్యత్యాసం ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నా ఫలితం ఉండడంలేదు. అయితే కొత్త ఓటర్లు నమోదు తక్కు వగా ఉంది. క్షేత్ర స్ధాయిలో బూత్‌ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప లక్ష్యం చేరుకోవడం సాధ్యపడదు. సమగ్ర ఓటరు జాబితా తయారీపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఓటు నమోదు చేయనుంది.


ఒక కేంద్రం పరిధిలోని ఇళ్లన్నీ ఒకేచోట ఉండేలా చర్యలు చేపట్టింది. మరోవైపు ఇంటెన్సివ్‌ రీజనల్‌ ఎలక్టోరల్‌ రోల్‌ (ఐఆర్‌ఈఆర్‌) పద్ధతి అమలుతో బోగస్‌ ఓటర్ల బండారం బయటపడనుంది. ఓటరుకు ఈ నూతన విధానంలో జియోట్యాగింగ్‌ చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పోలింగ్‌ బూత్‌ల పరిధిగా ఓటరు జాబితా ప్రకారం ఆ ప్రాంతం పోలింగ్‌ బూత్‌ మ్యాప్‌ను గుర్తించి దానికి జియో ట్యాగింగ్‌ చేయడం ద్వారా ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఓటర్ల ఓటింగ్‌ సరళి తీరు అతి సులభంగా సమీక్షించే అవకాశం జియో ట్యాగింగ్‌తో దోహదపడనుంది. ఓటర్ల ఆధార్‌కార్డులను అనుసంధానం చేయనున్నారు. నివాసం ఉంటున్న ఇళ్ళను జియో ట్యాగ్‌ చేస్తారు. 


షెడ్యూల్‌ ఇదే : ఫోటో ఓటర్ల జాబితా సవరణ కొత్త ఓటర్ల నమోదు మార్పులు అభ్యంతరాల స్వీకరణకు ప్రకటన జారీ, 2021 జనవరి నాటికి సవరించిన ఫోటో ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల పునర్వవ్యవస్థీకరణ కు ఓటర్లు జాబితాలో వ్యక్తమైన అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబరు 31 వరకు గడువు, సవరించిన ఓటర్ల జాబితాతో కూడిన ముసాయిదా నవంబరు 16న ప్రకటించాల్సి ఉంది. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబరు 15 వరకు గడువు. 2021 జనవరి 15న ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నది.


Updated Date - 2020-08-11T15:29:21+05:30 IST