రైల్వేకోడూరులో వ్యాపారుల స్వచ్ఛంద లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-22T06:53:51+05:30 IST
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరులో బుధవారం నుంచి వ్యాపార సంస్థల వారు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
మధ్యాహ్నం 2 నుంచి వ్యాపార సంస్థల మూసివేత
రైల్వేకోడూరు, ఏప్రిల్ 21: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరులో బుధవారం నుంచి వ్యాపార సంస్థల వారు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా వస్త్ర, కిరాణా, బంగారు, షుమార్టు, కుదవ తదితర దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేశారు. కరోనా వైరస్ తగ్గేంత వరకు రోజూ మధ్యాహ్న నుంచి దుకాణాలు మూసివేస్తామని వ్యాపార సంఘాలు ప్రకటించాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రే దుకాణాలు ఉంటాయని తెలిపారు. ఆ సమయంలో సైతం దుకాణాల వద్దకు వచ్చే కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు పాటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మందల రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి మేడా వెంకటసుబ్బయ్య, రెడీమేడ్ దుకాణాల అసోసియేషన్ అధ్యక్షుడు వీవీ క్రిష్ణ, కుదవ వ్యాపార సంఘాలు, బంగారు దుకాణాల అసోసియేషన్ అధ్యక్షుడు తోట యుగంధర్ తెలిపారు.