వలంటీర్‌ చేతివాటం

ABN , First Publish Date - 2022-08-12T05:46:42+05:30 IST

మండలంలోని మిట్టపల్లిలో ఓ వలంటీర్‌.. దివ్యాంగుల పింఛన సొమ్ములో కోతవేయడంతోపాటు వారి పిల్లల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును స్వాహా చేశాడు.

వలంటీర్‌ చేతివాటం
వలంటీర్‌ డబ్బు స్వాహాపై విచారిస్తున్న అధికారులు

పింఛన నగదు, వ్యక్తిగత ఖాతాల నుంచి సొమ్ము స్వాహా

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 11: మండలంలోని మిట్టపల్లిలో ఓ వలంటీర్‌.. దివ్యాంగుల పింఛన సొమ్ములో కోతవేయడంతోపాటు వారి పిల్లల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును స్వాహా చేశాడు. దీనిపై సర్పంచ సాజీయామజీద్‌తో కలిసి బాధితులు వెంకటప్పనాయుడు, వెంకటలక్ష్మమ్మ, ఖాదర్‌ బాషా.. ఎంపీడీఓ పోలప్పకు గురువారం ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌ రఫీ.. వెంకటప్పనాయుడు, వారి పిల్లల ఖాతాలో ఉన్న డబ్బు రూ.20వేలు స్వాహా చేశాడు. వీరితోపాటు ఉత్తప్ప భార్య వెంకటలక్ష్మమ్మ, ఖాదర్‌బాషా ఖాతాల్లోని డబ్బు, పింఛన సొమ్ము తీసుకున్నట్లు ఎంపీడీఓ ముందు వాపోయారు. ఎంపీడీఓ ఆదేశాల మేరకు.. ఈఓఆర్డీ రాజశేఖర్‌, కార్యదర్శి గౌస్‌సాహెబ్‌.. మిట్టపల్లికెళ్లి విచారించారు. స్వాహా పర్వం వాస్తవమని తేలింది. వలంటీర్‌ నుంచి సొమ్ము రికవరీ చేయడంతోపాటు అతడిని విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ చెప్పారు.



Updated Date - 2022-08-12T05:46:42+05:30 IST