పన్ను వివాదంలో భారత్పై వొడాఫోన్ విజయం
ABN , First Publish Date - 2020-09-25T23:30:53+05:30 IST
గత కాలానికి వర్తించే పన్ను వివాదం కేసులో భారత ప్రభుత్వంపై వొడాఫోన్ గ్రూప్ గెలిచినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ : గత కాలానికి వర్తించే పన్ను వివాదం కేసులో భారత ప్రభుత్వంపై వొడాఫోన్ గ్రూప్ గెలిచినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. రూ.20,000 కోట్ల పన్నుకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసులో వొడాఫోన్ విజయం సాధించిందని తెలిపింది. హేగ్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇచ్చినట్లు పేర్కొంది.
వొడాఫోన్పై భారత ప్రభుత్వం విధించిన పన్ను, వడ్డీ, జరిమానాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడుల ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ తీర్పు చెప్పినట్లు పేర్కొంది.
ఈ సొమ్ము చెల్లించాలని వొడాఫోన్ను కోరకూడదని, కోర్టు ఖర్చుల కోసం పాక్షిక నష్టపరిహారంగా 5.47 మిలియన్ డాలర్లు వొడాఫోన్కు చెల్లించాలని భారత ప్రభుత్వాన్ని ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెలిపింది.
అయితే ఈ వార్తలపై వొడాఫోన్, భారత ప్రభుత్వం స్పందించలేదని ఆ వార్తా సంస్థ తెలిపింది.