ఛార్జీలు పెరిగినా... దూసుకుపోతున్న వొడా ప్రీపెయిడ్...
ABN , First Publish Date - 2021-11-29T20:37:11+05:30 IST
ఛార్జీలను పెంచినప్పటికీ... ప్రముఖ సెల్ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్... దుమ్మురేపుతోంది. అద్భుతమైన కొనుగోళ్ల మద్దతుతో ఈ రోజు(సోమవారం) ఇంట్రా-డేలో వొడాఫోన్ ఐడియా షేర్లు 14 శాతం పెరిగి, తాజా తొమ్మిది నెలల గరిష్ట స్థాయి రూ. 12.39 కి చేరడం గమనార్హం.
హైదరాబాద్ : ఛార్జీలను పెంచినప్పటికీ... ప్రముఖ సెల్ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్... దుమ్మురేపుతోంది. అద్భుతమైన కొనుగోళ్ల మద్దతుతో ఈ రోజు(సోమవారం) ఇంట్రా-డేలో వొడాఫోన్ ఐడియా షేర్లు 14 శాతం పెరిగి, తాజా తొమ్మిది నెలల గరిష్ట స్థాయి రూ. 12.39 కి చేరడం గమనార్హం. మొన్న(25 వ తేదీ) నుండి కంపెనీ తన ప్రీపెయిడ్ టారిఫ్ను 20-25 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఆరు ట్రేడింగ్ రోజుల్లో... టెలికం సర్వీస్ ప్రొవైడర్ స్టాక్ 24 శాతం ర్యాలీ చేసింది. వాస్తవానికి... ఈ స్టాక్ ఫిబ్రవరి 12 నుండి కూడా అత్యధిక స్థాయిలో ట్రేడవుతోంది.
జనవరి 15 న ఇది... రూ. 13.80 వద్ద, 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ రోజు... ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో 498 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారడంతో కౌంటర్ భారీ ట్రేడింగ్ వాల్యూమ్లను చూసింది. ఈ క్రమంలో... వొడాఫోన్ ఐడియా కూడా భారతీ ఎయిర్టెల్ బాటలో పయనించింది. వాస్తవానికి... ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ కంపెనీకి ఏజీఆర్ బకాయిలు... ‘మూలిగే నక్కపై తాటిపండు పడి’న చందంగా మారాయి. ఏజీఆర్ బకాయిల విషయంలోనూ ఊరట లభించకపోవడంతో వ్యాపారాన్ని కొనసాగించేందుకు కంపెనీకి... భారీగా నిధుల సేకరణ అనివార్యంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకోవడం ఈ కంపెనీకి తప్పనిసరిగా మారింది. దీంతో ఎయిర్టెల్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వొడాఫోన్ ఐడియా సైతం ప్రీపెయిడ్ పథకాల చార్జీలను పెంచివేసింది. ఈ పెరిగిన చార్జీలు ఇప్పటికే అంటే ఈనెల 25 నుంచే అమల్లోకి వచ్చాయి.