ఇక ఫోన్ చేయాలంటే వణుకే.. ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా
ABN , First Publish Date - 2021-11-23T21:57:06+05:30 IST
చూస్తుంటే ఫోన్ ముట్టుకోవాలంటే భయపడే రోజులు మళ్లీ వచ్చేలా కనిపిస్తున్నాయి. గతంలో అవుట్ గోయింగ్ కాల్స్ చేయాలంటే
న్యూఢిల్లీ: చూస్తుంటే ఫోన్ ముట్టుకోవాలంటే భయపడే రోజులు మళ్లీ వచ్చేలా కనిపిస్తున్నాయి. గతంలో అవుట్ గోయింగ్ కాల్స్ చేయాలంటే భయపడేవారు. నిమిషాలు లెక్కపెట్టుకునేవారు. టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నెలకు ఇంత అని చెల్లించి ఎవరు ఎంతసేపైనా మాట్లాడుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో మిగతా టెలికం కంపెనీలు దిగొచ్చి రిలయన్స్నే అనుసరించాయి.
అందరూ ఒకే దారిలోకి వచ్చిన తర్వాత మళ్లీ బాదుడు మొదలైంది. దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ ఎయిర్టెల్ నిన్న ప్రీపెయిడ్ టారిఫ్లను పెంచేసి వినియోగదారులకు భారీ షాకిచ్చింది. కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్ఠంగా రూ.501 వరకు పెంచేసింది. ఆ దెబ్బ నుంచి వినియోగదారులు తేరుకోకముందే వొడాఫోన్ ఐడియా కూడా అలాంటి ప్రకటనే చేసింది. ఇప్పటికే బోల్డన్ని నష్టాల్లో కూరుకుపోయి బయటపడలేక తంటాలు పడుతున్న వొడాఫోన్ ఐడియా నేడు చేసిన ప్రకటన దాని వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టించింది.
అన్ని కాలింగ్, డేటా టారిఫ్లపై 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఈ రోజు ప్రకటించింది. ఎల్లుండి (25వ తేదీ) నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా కనీస ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ధరను 25.31 శాతం పెంచింది. ప్రస్తుతం రూ. 79గా ఉన్న ఈ ప్యాక్ ఇకపై రూ. 99కు అందుబాటులో ఉంటుంది. అన్లిమిటెడ్ కేటగిరీ ప్లాన్లపై 20 నుంచి 23 శాతం వరకు పెంచింది.
ప్రస్తుతం రూ. 219గా ఉన్న అతి తక్కువ బండిల్డ్ ప్లాన్ ధరను రూ. 269కి పెంచింది. ఇందులో రోజుకు 1 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. అలాగే, రూ.599 ప్యాక్ ధరను రూ. 719కి పెంచింది. ఈ ప్యాక్లో రోజుకు 1.5 జీబీ డేటా 84 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఏడాది కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ లభించే రూ. 2,399 ప్లాన్ను ధరను 20.8 శాతం పెంచి రూ.2899 చేసింది.
వీటితోపాటు లో వ్యాల్యూ డేటా టాపప్ ప్యాక్లను కూడా 20 శాతం మేర పెంచింది. భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్ టారిఫ్ ధరలను పెంచిన తర్వాతి రోజే వొడాఫోన్ ఐడియా ఈ ప్రకటన చేయడం గమనార్హం. త్వరలోనే జియో కూడా టారిఫ్ చార్జీలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెలికంరంగ పునరుద్ధరణకు చార్జీల పెంపు కీలకంగా మారిందని టెలికం కంపెనీలు చెబుతున్నాయి.