వీఎంసీ సిస్టమ్స్‌ ఎండీ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-08-06T08:58:27+05:30 IST

బోగస్‌ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రూ. 3,316 కోట్ల మోసం చేసిన కేసులో వీఎమ్‌సీ సిస్టమ్స్‌ ఎండీ ఉప్పలపాటి హిమబిందును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.

వీఎంసీ సిస్టమ్స్‌ ఎండీ అరెస్ట్‌

బోగస్‌ పత్రాలతో బ్యాంకుల నుంచి  రూ.3,316 కోట్ల రుణాలు 

మనీ లాండరింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ


హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బోగస్‌ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రూ. 3,316 కోట్ల మోసం చేసిన కేసులో వీఎమ్‌సీ సిస్టమ్స్‌ ఎండీ ఉప్పలపాటి హిమబిందును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. డైరెక్టర్లు వి. సతీష్‌, మాధవి పరారీలో ఉన్నారని, వారిపై లుకౌట్‌ నోటీసు జారీ చేశామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వీఎంసీ సిస్టమ్స్‌ సంస్థ.. టెలికాం పరికరాలు తయారు చేస్తుంది. సంస్థ ఎండీ హిమబిందు.. తన సోదరుడు సతీ్‌షతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్షియంలో రుణాలు తీసుకున్నారు. ఈ మోసాన్ని గుర్తించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అధికారులు.. 2018లోనే సీబీఐకి ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో తీసుకున్న ఈ రుణాలను.. ఈ సంస్థ విదేశాలకు తరలించిందని పేర్కొన్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. పక్కా ఆధారాలు సేకరించింది.


హిమబిందు, మరో ఇద్దరు డైరెక్టర్లపై నేరపూరితమైన కుట్ర, మోసం, ఫోర్జరీ అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసింది. మనీ లాండరింగ్‌ జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో.. ఈడీకీ సమాచారం అందించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు నమోదుచేసిన ఈడీ.. గత ఏడాది జులైలో హిమబిందు, సతీష్‌, మాధవి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. కీలక పత్రాలతోపాటు 40 హార్డ్‌ డిస్కులు, 6 మొబైల్‌ ఫోన్లు, 2 ల్యాబ్‌టా్‌పలు స్వాధీనం చేసుకుంది. ఈ రుణాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హిమబిందుకు నోటీసులిచ్చింది. కానీ, ఆమె నుంచి స్పందన లేదు. దీంతో.. ఆమెను అరెస్టు చేసిన ఈడీ... గురువారం ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు.. ఈనెల 18 వరకు హిమబిందుకు రిమాండ్‌ విధించింది.

Updated Date - 2021-08-06T08:58:27+05:30 IST