‘వీఎంహోం విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి’
ABN , First Publish Date - 2022-08-12T06:08:37+05:30 IST
విక్టోరియా మెమోరియల్ హోంలోని అనాథ విద్యార్థులను ప్రిన్సిపాల్ సుహాసిని చిన్నచిన్న కారణాలతో బయటకు వెళ్లగొడుతూ భయబ్రాంతులకు
ఎల్బీనగర్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): విక్టోరియా మెమోరియల్ హోంలోని అనాథ విద్యార్థులను ప్రిన్సిపాల్ సుహాసిని చిన్నచిన్న కారణాలతో బయటకు వెళ్లగొడుతూ భయబ్రాంతులకు గురిచేస్తోందని వీఎంహోం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బీమగాని మహేశ్వర్గౌడ్ సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణ, కార్యదర్శి ఆనగంటి కిషన్లకు ఫిర్యాదు చేశారు. వీఎంహోంలో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనాథ పిల్లలకు కేజీ టూ పీజీ విద్య అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. రక్షణ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోకి బయటవారు వచ్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. వీఎంహోంలో వోకేషనల్ కోర్సులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. విద్యార్థుల కోసం కొనుగోలు చేసిన జిమ్ సామగ్రి, బెడ్స్, ఆరుబయట పడేయడంతో పనికిరాకుండా పోతున్నాయని చెప్పారు. విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కారం కోసం కౌన్సెలింగ్ సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వీఎంహోం పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి గందమళ్ల రాము, ఉపాధ్యక్షుడు రాజు, సహాయ కార్యదర్శి కేతావత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.