VK Sasikala: త్వరలో అన్ని వర్గాలూ విలీనం
ABN , First Publish Date - 2022-08-11T13:02:28+05:30 IST
అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు మళ్ళీ ఏకమవుతాయని, పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు వీకే శశికళ(VK Sasikala)
చెన్నై, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు మళ్ళీ ఏకమవుతాయని, పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు వీకే శశికళ(VK Sasikala) ఆశాభావం వ్యక్తం చేశారు. దిండుగల్(Dindugal) జిల్లా చిన్నాలపట్టిలో మృతి చెందిన అన్నాడీఎంకే తొలి లోక్సభ సభ్యుడు మాయదేవర్(Mayadevar)కు నివాళులర్పించేందుకు ఆమె బుధవారం ఉదయం విమానంలో మదురై బయలుదేరి వెళ్ళారు. మదురై నుంచి ఆమె కారులో చిన్నాలపట్టి చేరుకుని మాయదేవర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదురై విమానాశ్రయం(Madurai Airport)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకేకు అధికారిక చిహ్నాలేవీ లేనప్పుడే మాయదేవర్ స్వతంత్ర చిహ్నంగా రెండాకుల గుర్తుపై పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారన్నారు. అన్నాడీఎంకేకు ఆయనే తొలి ఎంపీ కావడం విశేషమన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రెండాకుల చిహ్నమే ఆ తరువాత కాలంలో పార్టీ అధికారిక చిహ్నంగా మారిందన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినా భవిష్యత్తులో అన్ని వర్గాలు ఏకమవుతాయని శశికళ ఆశాభావం వ్యక్తం చేశారు.