మద్యానికి లాక్ లేదు!
ABN , First Publish Date - 2020-04-03T11:12:13+05:30 IST
- మెంటాడ మండలం కొంపంగిలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి 25 మద్యం సీసాలతో పట్టుబడ్డాడు.
ఇష్టారాజ్యంగా రవాణా, విక్రయాలు
షాపులు మూతపడినా బయటకు వస్తున్న సరుకు
సరిహద్దు మండలాల్లో సారా జోరు
జీలుగు, తాటికల్లుదీ అదే తీరు
చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ
(విజయనగరం-ఆంధ్రజ్యోతి):- మెంటాడ మండలం కొంపంగిలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి 25 మద్యం సీసాలతో పట్టుబడ్డాడు. సీసాలపై ప్రభుత్వ దుకాణాలకు సంబంధించి సీల్ వేసి ఉంది. రెండు వారాలుగా మద్యం దుకాణాలు మూతపడగా ఈ సీసాలు ఎలా బయటకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.
పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు వద్ద బుధవారం 14 మద్యం సీసాలతో వ్యక్తి పట్టుబడ్డాడు. ఒడిశాలోని సుంకి నుంచి వీటిని తెస్తుండగా పోలీసులు పట్టుకున్నారు
ఇటీవల విజయనగరంలోని కణపాక సమీపంలో ఓ మహిళ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 5 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇలా జిల్లావ్యాప్తంగా మద్యం రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు మూతపడినా విక్రయాలు మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎక్సైజ్ శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 15 రోజులుగా జిల్లాలో ఏదో మూలన మద్యం పట్టుబడుతూనే ఉంది. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసు సిబ్బందికి మద్యం పట్టుబడుతోంది.. ఎక్సైజ్ శాఖ మాత్రం తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది.
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా స్థానిక సంస్థ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఎన్నికల దృష్ట్యా చాలామంది నాయకులు ముందస్తుగా మద్యం రహస్య ప్రాంతాలకు తరలించారు. ఈలోపల ఎన్నికలు వాయిదా పడడం.. లాక్డౌన్తో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో నాయకులు తరలించిన మద్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. వాటిని రెట్టింపు సొమ్ము చేసుకున్నారు. అటువంటి మద్యం తరలిస్తుండగా ప్రస్తుతం పోలీసులకు పట్టుబడుతోంది. పార్వతీపురం, జియ్యమ్మవలస, సాలూరు, మామిడిపల్లి, పాచిపెంట, గజపతినగరం, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి ఇలా అనేక ప్రాంతాల్లో నేతలు నిల్వ ఉంచిన మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎస్.కోట మండలం ఎస్.కోట, పోతనాపల్లి. ఎల్.కోట మండలం కొట్యాడ ప్రాంతాల్లో రహస్యంగా విక్రయిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి మంజీరా, హైదరాబాద్ ఫ్రైడ్ రకం తదితర బ్రాండ్లకు సంబంధించి క్వార్టర్ ధర రూ.130 ఉంది. కానీ వాటిని రూ.300కు విక్రయిస్తున్నారు. బ్లెండర్స్పైడ్ ఫుల్ బాటిల్ ధర రూ.1030 ఉంది. కానీ రూ.250 వరకూ అమ్ముతున్నారు. సరిహద్దు మండలాలైన పాచిపెంట, సాలూరు, మక్కువ, పార్వతీపురం, కొమరాడలో ఒడిశా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
మద్యం షాపుల మూతతో మందుబాబుల దృష్టి సారాపై పడింది. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తయారైన సారా జిల్లాకు పెద్ద ఎత్తున వస్తోంది. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ, గజపతినగరం, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, గంట్యాడ, డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరం, గుర్ల, గరివిడి, చీపురుపల్లి తదితర ప్రాంతాలకు రహస్యంగా తరలించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. తాటికల్లుకు కూడా డిమాండ్ పెరిగింది. సాలూరు, పాచిపెంట, మక్కువ, పార్వతీపురం, గమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస తదితర మండలాల్లో జీలుగ కళ్లు విరివిగా లభ్యమవుతోంది. డిమాండ్ దృష్ట్యా రెట్టింపు ధరకు అమ్ముతున్నారు.