విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు

ABN , First Publish Date - 2021-03-11T02:28:02+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు

ఇంటర్నెట్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన గళం విప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలకు ప్రతీక అంటూ ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశారు.  పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. 


‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని, నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తామనే నినాదాన్ని రాశామంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశామన్నారు. దాదాపు 35 మంది పౌరులతో పాటు, 9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగరం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామన్నారు. ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించామన్నారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించామన్నారు. 


విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌మైన్స్ కేటాయించకపోవడం, అలాగే నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరారు. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్‌ను ప్రజల మనోభావాలను గౌవరించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యమని, ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కని ఆయన పేర్కొన్నారు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామన్నారు. 



Updated Date - 2021-03-11T02:28:02+05:30 IST