వివేకానందుడి స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2022-06-30T05:29:57+05:30 IST
వివేకానందుడి స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిది ద్దాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
స్వామి వివేకానంద విగ్రహావిష్కరణలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
భీమవరం, జూన్ 29 : వివేకానందుడి స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిది ద్దాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం భీమవరం పట్టణ శివారున స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు, ప్రాతాళ్ళమెరక విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో నిర్మించిన వివేకానంద సేవా సమితి భవనం, విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘నేను భగవంతుడికి పాఠాలు చెబుతున్నాను అనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠాలు బోధిస్తే ఎంతో చక్కటి విద్యార్థి తయారవుతాడు’ అని అన్నారు. రామకృష్ణ మఠం ఉపాధ్యక్షుడు గౌతమ్ ఆనంద్జి మహరాజ్ మాట్లాడుతూ ప్రతీ మనిషికి ప్రశాంతత కావాలి, అప్పుడే మనుగడ ఉంటుంది. మనం ఎక్కడ ఈ మనశ్శాంతిని పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటే లభిస్తుందన్నారు. ఈ భవనం గురించి శివవర్మ ఎంతో కృషి చేశారని, గతంలో ఏలూరులో నిర్మించాలనుకున్నారని చివరికి భీమవరంలో నిర్మించారని అభినందించారు. తొలుత వీవీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకానంద సేవా సమితి భవనాన్ని రామకృష్ణ మఠం ఉపాధ్యక్షుడు గౌతమ్ ఆనంద్ జి మహరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, వివేకానంద సేవా సమితి గౌరవాధ్యక్షుడు డీవీ సోమరాజు, కార్యదర్శి డి.నారాయణరాజు, రంగసాయి తదితరులు పాల్గొన్నారు.