వివేకా హత్య కేసు.. రంగన్న వెల్లడించిన పేర్లపై సీబీఐ దృష్టి
ABN , First Publish Date - 2021-07-27T20:32:35+05:30 IST
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై సీబీఐ అధికారులో వేగం పెంచారు. ఈ కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై సీబీఐ అధికారులో వేగం పెంచారు. ఈ కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న వాంగ్మూలం మేరకు సీబీఐ బృందం విచారణకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల జమ్మలమడుగు కోర్టులో రంగన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. వాంగ్మూలంలో రంగన్న వెల్లడించిన పేర్లపై సీబీఐ దృష్టిసారించింది. 4 రోజుల క్రితం రంగన్న జమ్మలమడుగు కోర్టులో 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పులివెందులలో ఏడుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్కుమార్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్ సతీష్రెడ్డి, డాక్టర్ మధు, కిశోర్కుమార్రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణాధికారి రామ్కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
వివేకా హత్య కేసులో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్మన్ రంగయ్య శుక్రవారం రాత్రి స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుట పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి నివాసానికి వచ్చిన ముగ్గురి పేర్లను జడ్జికి చెప్పానని తెలిపారు. నాలుగో వ్యక్తి కూడా ఉన్నారని... బాగా పొడవుగా ఉన్న ఆయనను గతంలో తాను చూడలేదని పేర్కొనడం రంగయ్య గమనార్హం.