తిరుమలలో మొదలైన సీనియర్ సిటిజన్ల దర్శనాలు
ABN , First Publish Date - 2022-04-10T02:19:13+05:30 IST
దాదాపు రెండేళ్ల తర్వాత వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు శనివారం నుంచి ప్రత్యేక దర్శనాలు మొదలయ్యాయి.
తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు శనివారం నుంచి ప్రత్యేక దర్శనాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా 2020 మార్చి రెండవ వారం నుంచి టీటీడీ అన్ని రకాల ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ దర్శనాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలను మొదలుపెట్టినప్పటికీ కొవిడ్ పూర్తిస్థాయిలో తగ్గని నేపథ్యంలో ఈ ప్రత్యేక దర్శనాన్ని మాత్రం ప్రారంభించలేదు. అయితే ప్రస్తుతం కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిన క్రమంలో శనివారం నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాలను మొదలుపెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఆన్లైన్ ద్వారా వీరికి టోకెన్లు కేటాయించారు. ఆన్లైన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులు శనివారం ఉదయం 10 గంటల స్లాట్లో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.