11, 12 వార్డుల్లో జీవీఎంసీ కమిషనర్, మేయర్ పర్యటన
ABN , First Publish Date - 2022-01-22T04:51:30+05:30 IST
జీవీఎంసీ 11, 12 వార్డుల్లో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, మేయర్ గొలగాని హరివెంకటకుమారి శుక్రవారం పర్యటించారు.
ఆరిలోవ, జనవరి 21: జీవీఎంసీ 11, 12 వార్డుల్లో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, మేయర్ గొలగాని హరివెంకటకుమారి శుక్రవారం పర్యటించారు. చినగదిలి సాయిబాబా ఆలయం నుంచి ఆరిలోవ అంబేడ్కర్ జంక్షన్ వరకు గల ప్రధాన రహదారిని డబుల్ రోడ్డు చేయాలని, దానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను వారు ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో మొదటి ర్యాంకు లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు. దుకాణదారులు నిషేధిత ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పెదగదిలి వద్ద బీఆర్టీఎస్ రోడ్డును పరిశీలించి ఈ ప్రాంతం లోతట్టుగా ఉండడం వల్ల వర్షపు నీరు నిలిచిపోతోందని, నీరు పోయేందుకు కాలువలు నిర్మించాలన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఉన్న బావి నీటిని డివైడర్పై ఉన్న మొక్కలకు ఉపయోగించాలని, లేని పక్షంలో బావిని పూడ్చేయాలన్నారు. పెదగదిలి జంక్షన్ నుంచి ఆరిలోవ వెళుతున్న ప్రధాన రహదారిలో ఉన్న వంతెన ఎత్తు పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ నిర్వహించారు. వారి వెంట వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజనీర్ మత్స్యరాజు, ఏసీపీ భాస్కరబాబు, ఏఎంహెచ్వో డాక్టర్ కిశోర్ తదితరులు ఉన్నారు.