దార్శనికుడు, కార్యదక్షుడు

ABN , First Publish Date - 2020-06-26T08:37:53+05:30 IST

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలను అద్వితీయంగా అమలుపరిచిన పాలనాదక్షుడు పీవీ నరసింహరావు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు...

దార్శనికుడు, కార్యదక్షుడు

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలను అద్వితీయంగా అమలుపరిచిన పాలనాదక్షుడు పీవీ నరసింహరావు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు.


తత్త్వశాస్త్ర వేత్తలే సమాజానికి, దేశాలకు ఉత్తమమైన పాలకులు అని ప్రాచీన గ్రీకు తాత్వికుడు ప్లేటో ఉద్ఘాటించారు. తత్త్వవేత్తలే పాలనలో న్యాయాన్ని ధర్మాన్ని సమానంగా, సమతుల్యంగా స్వీకరిస్తారని ప్లేటో అంటారు. అలాగే చాణక్యుడిగా ప్రసిద్ధికెక్కిన అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడి అభిప్రాయం ప్రకారం– సానుకూల, ప్రతికూల భావోద్వేగాలను అర్థం చేసుకుని తదనుగుణంగా పాలన చేసినప్పుడే ఎవరైనా మంచి నాయకుడు కాగలడు. ఒక వ్యక్తి మంచి, చెడు రెండింటినీ ఒకే సమయంలో, ఒకే కోణంలో చూసినప్పుడు, తనంతట తానుగా ఏకకాలంలో నిర్ణయానికి రాగలిగినప్పుడే మంచి నాయకుడు కాగలడు అని కూడా కౌటిల్యుడి విశ్వాసం. దివంగత భారత ప్రధాని పీవీ నరసింహారావు ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఏకైక వ్యక్తి అనడంలో అతిశయోక్తి లేదేమో! ఒక తత్త్వవేత్త అయిన ప్రధానిగా, ఒక ఆర్థిక వేత్త అయిన ప్రధానిగా, ఒక సామాజిక వేత్త అయిన ప్రధానిగా, ఒక రాజకీయవేత్త అయిన ప్రధానిగా, ఒక భాషావేత్త అయిన ప్రధానిగా, ఒక అభ్యుదయ వేత్త అయిన ప్రధానిగా, ఒక విద్యావేత్త అయిన ప్రధానిగా, అన్నింటినీ కలగలపిన ఒక బహుముఖ ప్రజ్ఞాశీలిగా పీవీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.


భారతదేశం, ఆమాటకొస్తే, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరీక్షా కాలంలో, సామాన్య మానవుడి మనుగడే ప్రశ్నార్థకమవుతున్న కరోనా సంక్షోభ సమయంలో, ఆర్థికవ్యవస్థ గాడి తప్పుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ స్ఫురణకు వచ్చేది పీవీ రాజనీతిజ్ఞత, ఆర్థిక సంస్కరణాభిలాష. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశాన్ని కుదిపివేస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని చాకచక్యంగా పరిష్కరించి, దేశానికి బంగారు బాట వేసి, దిశానిర్దేశం చేసిన రాజనీతిజ్ఞుడు పీవీ. ఆయన పాలనా ఫలితాలు, ఫలాలు ఇటీవలి కాలం వరకు మనమంతా అనుభవిస్తూనే ఉన్నాము. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో మాత్రం ఒక అడుగు వెనక్కే వున్నామనాలి. అందుకే పీవీని స్మరించుకోవటం సదా మన కర్తవ్యం, మన నైతిక బాధ్యత, మన కనీస ధర్మం. అత్యున్నత వ్యక్తిత్వం పీవీ సొంతం. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరణీయం. 


పీవీ జీవిత కాలంలో అనేక సందర్భాలలో, ఆయనను తక్కువగా అంచనా వేశారు కొందరు. అయితే అదే పీవీ, భారతదేశం ఒక ప్రధాన సమాచార సాంకేతిక భాండాగారంగా పరివర్తన చెందడానికి, దేశాన్ని బంగారం తాకట్టు పెట్టాల్సిన స్థితి నుంచి తప్పించడానికి, ఒక సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దడానికి కారణభూతుడయ్యాడు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మునుపెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్ సరళీకరణ విధానాన్ని రూపొందించాడు. దురదృష్టవశాత్తూ పీవీ ఆశయాలకు చేరువగా ఆయన రూపకల్పన చేసిన ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ విధానాలను తదనంతర ప్రభుత్వాలు కొనసాగించలేకపోయాయి. కొంతలో కొంత అయితే అమలు చేశాయి.


పీవీ మేధో సంపత్తి గురించి ఆయనను అనుసరించిన వారందరికీ తెలుసు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించే దార్శనికుడని, స్వార్థపూరిత ఆలోచనలు చేయనివాడని తెలుసు. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ మంత్రిగా పేదలకు రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆలోచనను నవోదయ విద్యాలయాల రూపంలో జాతీయస్థాయిలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న రోజుల్లో జాతీయ విద్యా విధానం రూపొందించిన విద్యావేత్త పీవీ.


సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యాభై సంవత్సరాల క్రితం 1972 ఆగస్టు 30న శాసనసభలో ప్రసిద్ధ భూసంస్కరణల బిల్లు ప్రవేశపెట్టిన ఘనత పీవీ సొంతం. ఇది వినూత్నమైన భూ సంస్కరణల బిల్లు. దేశంలో మొదటిది. పీవీ తీసుకువచ్చిన భూసంస్కరణలు భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి బాటలు వేశాయి, భూమిలేని పేదలు చిన్న-చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేద వారికి సమాజంలో గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. పీవీ తరువాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో భూ రికార్డులను సరిదిద్దడం, శుద్ధి చేయడం, నవీకరించడం చేపట్టి అమలుపర్చారు. శాసనసభలో భూసంస్కరణల బిల్లును ప్రవేశపెడుతూ, పీవీ చేసిన ప్రసంగం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పెద్ద కమతాలు ప్రజలను ఎలా అహంకారపూరితులను చేస్తాయో, కొద్దిపాటి భూమి వున్న పేదరైతుకు సమాజంలో గౌరవం ఎలా దక్కుతుందో, దున్నేవారికే భూమి ఎందుకు ఇవ్వాలో పీవీ సవివరంగా తెలియచెప్పారు. భూస్వాములు తమ పెంపుడు కుక్కలు, పిల్లులు మొదలైన వాటిపై తమ భూములను బదిలీ చేయడానికి దోహదపడే విధంగా బిల్లు ఆమోదాన్ని ఆలస్యం చేయవద్దని ఆయన సభను కోరారు. దురదృష్టవశాత్తు, ఈ అభివృద్ధి చర్య గిట్టని ఆయన సొంత పార్టీకి చెందిన ప్రగతినిరోధక ముఠా ఆయన కుర్చీని లాగివేసింది. బహుశా అప్పుడు వారికి తెలియదు కాబోలు, ఒక రోజు పీవీ దేశాన్ని నడిపించడానికి అంచెలంచెలుగా నిచ్చెన ఎక్కుతాడని, ప్రధాన మంత్రి అవుతాడని.


రాజకీయాల నుండి దాదాపు విరమణ చేసిన నేపథ్యంలో, పీవీ అడగకుండానే ప్రధాని అయ్యారు. నెహ్రూ-గాంధీల కుటుంబానికి చెందని, పూర్తి అయిదు సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తి పీవీ. దేశంలో పీవీ బాధ్యతలు స్వీకరించిన నాడు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా వుండేది. భారతదేశం ఎప్పటికైనా కోలుకుంటుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు! కానీ అది అద్భుతంగా, సమర్థంగా, యావత్ ప్రపంచం అబ్బురపడే విధంగా పీవీ హయాంలో జరిగింది. 


బహుభాషా కోవిదుడైన పీవీ తన జ్ఞాపకాలను ‘ది ఇన్ సైడర్’ పుస్తకంలో పొందుపరచారు. అంతకు చాలా సంవత్సరాల క్రితమే, జ్ఞానపీఠ ఆవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ తెలుగు పుస్తకాన్ని హిందీలోకి ‘సహస్రఫణ్’ గా అనువదించారు. ఎడతెగని, క్షణమైనా తీరికలేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, అన్ని భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. ఆయన 17 భాషలలో నిష్ణాతులు. ఆర్థికశాస్త్రం, చట్టం, చరిత్ర, రాజకీయాలు, కళలలో కూడా ఆయన అపార ప్రావీణ్యం ఉంది.


దురదృష్టవశాత్తు, కారణాలేవైనా, ఆయన అభిమానించిన, ఆరాధించిన కాంగ్రెస్ పార్టీ పీవీని ఒక సమర్థ నాయకుడిగా గుర్తించలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పీవీ పోషించిన పాత్రపై అర్జున్ సింగ్ వంటి నాయకులు ఆయన మరణానంతరం అనేక విమర్శలు చేశారు. మధు లిమాయే వంటి సోషలిస్టు నాయకులు, కుల్దీప్ నయ్యర్ వంటి జర్నలిస్టులు కూడా ఆయన్ను అనేక రకాలుగా విమర్శించారు. అవన్నీ తప్పు అని పీవీతో కలిసి పనిచేసిన ప్రముఖులు ఎందరో పత్రికా ముఖంగా చెప్పారు కూడా. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పీవీ మరణానంతరం ఆయన పార్థివ దేహాన్ని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలోకి తీసుకుపోవడానికి అంగీకరించలేదు. అంత్య క్రియలకు హైదరాబాద్ తీసుకువచ్చినప్పుడు కూడా అప్పటి కాంగ్రెస్ పాలనలో అంత గొప్ప వ్యక్తికి తగిన గౌరవం లభించలేదు అనే చెప్పాలి. మరణానంతరం ఆయనకు జరిగిన అవమానాన్ని గురించి ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు బహిరంగ సభలలో మాట్లాడారు కూడా. స్థితప్రజ్ఞతకి, మూర్తీభవించిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం పీవీ. జెఎంఎం కుంభకోణంలో మేజిస్ట్రేట్ కోర్టు శిక్ష విధించినప్పుడు, మీడియాలో బహుళ ప్రచారం జరిగినప్పుడు పీవీ స్పందన పరిపూర్ణ నిశ్శబ్దం. ఈ కేసులన్నిటిలోనూ ఆయన నిర్దోషి అని తేలినప్పుడు అదే మీడియా తగు రీతిలో స్పందించలేదు! 


తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ, పీవీ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా, అధికారికంగా ఏటేటా నిర్వహిస్తున్నారు. ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించడానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేశవరావు అధ్యక్షతన కేసీఆర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ ఉత్సవాలు జాతీయ స్థాయిలో, అన్ని రాష్ట్రాలలో నిర్వహించాలి. అందుకు అనుగుణంగా ప్రధాని మోదీ జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ బాటలో ఇతర రాష్ట్రాలు కూడా శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. ఈ మిలీయం నాయకుడు పీవీ నరసింహారావుకు అదే భారత ప్రజల ఘనమైన నివాళి.

వనం జ్వాలా నరసింహారావు 

(జూన్ 28 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు)

Updated Date - 2020-06-26T08:37:53+05:30 IST