విశ్వరూపిణి.. అశ్వవాహిని
ABN , First Publish Date - 2021-12-08T07:18:03+05:30 IST
శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వీకలలక్ష్మిగా, రాత్రి కల్కి అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు.
నేడు ఉదయం 11.52 గంటలకు పంచమితీర్థం
తిరుమల నుంచి శ్రీవారిసారె రాక
తిరుచానూరు, డిసెంబరు 7: శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వీకలలక్ష్మిగా, రాత్రి కల్కి అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఉదయం అద్దాలమహల్ నుంచి సిరులతల్లిని వాహన మండపానికి వేంచేపు చేశారు. బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తుండటంతో రథోత్సవం బదులు.. సర్వభూపాల వాహనాన్నే మహారథంలా అలంకరించి ముత్యపు కవచ అలంకరణలో వీరలక్ష్మిగా పద్మావతిదేవిని అధిష్ఠింపచేశారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ ముఖమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి పట్టు పీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో దివ్యమంగళంగా కల్కి అవతారంలో అశ్వవాహనంపై అమ్మవారిని అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ ఏకాంతం జరిగింది. దీంతో 8 రోజులుగా సాగిన వాహనసేవలు ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో జియ్యర్ స్వాములు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, ఆలయ అధికారులు మధుసూదన్, శేషగిరి, రాజే్షకన్నా, దాము, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పంచమితీర్థం
బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన బుధవారం అమ్మవారికి పంచమితీర్థం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏకాంతం నేపథ్యంలో వాహన మండపంలోనే తొట్టె నిర్మించారు. ఇందులో ఉదయం 11.52 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తారు.
తిరుమల నుంచి సారె
పంచమితీర్థం రోజున తన దేవేరి పద్మావతికి తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ముత్తయిదువ సారె పంపించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం వేకువనే తిరుమలలో జియ్యంగార్ల ఆధ్వర్యంలో పట్టు చీర, పసుపు, కుంకుమ, చందనం, తిరు ఆభరణాలు, అన్నప్రసాదాలు తదితరులతో కూడిన సారెను కాలినడకన తిరుచానూరుకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.