విశాఖలో విషాద ఘటనలు.. పది మంది మృతి.. అసలేం జరిగింది!?

ABN , First Publish Date - 2021-04-15T14:11:24+05:30 IST

విశాఖలోని పెందుర్తి మండలం జత్తాడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది...

విశాఖలో విషాద ఘటనలు.. పది మంది మృతి.. అసలేం జరిగింది!?

విశాఖపట్నం : విశాఖ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌లోని ఎన్ఆర్ఐ ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు థాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని తెలుస్తోంది.


అన్నీ అనుమానాలే..!

కాగా.. మిథిలాపురి కాలనీ, అపార్ట్‌మెంట్‌లోని‌ ఐదో అంతస్తులో 8 నెలల నుంచి ఎన్ఆర్ఐ కుటుంబం నివసిస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్ (22), కశ్యప్ (19)గా పోలీసులు నిర్ధారించారు. అయితే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురి మృతికి కారణం పాత కక్షలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


ఘటనాస్థలంలో రక్తపు మరకలు..!

ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమనీ తెలుస్తోంది. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఘటనపై డీసీపీ సురేష్ బాబు, ఏసీపీ శ్రీపాదరావు ఆరా తీస్తున్నారు.


మరో కుటుంబంలో ఆరుగురు..!?

ఇదే విశాఖలోని పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒకే కటుంబానికి చెందిన ఆరుగురిని అతి దారుణంగా దుండగులు హత్య చేశారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వచ్చిన దుండుగుడు ఆరుగుర్ని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. వరుస ఘటనలతో నగరంలో అసలేం జరుగుతోంది..? అంటూ విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఆరుగురు హత్య ఘటనలో ఆరు నెలల పాప, రెండు నెలల వయసున్న బాబు కూడా ఉండటం స్థానికులను కలచివేస్తోంది. ఈ ఘటనలో అప్పలరాజు అనే వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇంతవరకూ దీనిపై స్పందించలేదు.. అప్పలరాజును అదుపులోకి తీసుకున్న విషయాన్ని కూడా ధృవీకరించలేదు.

Updated Date - 2021-04-15T14:11:24+05:30 IST