విషాదం

ABN , First Publish Date - 2022-05-22T06:47:45+05:30 IST

ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన దేవరాపల్లిలో శనివారం చోటుచేసుకుంది.

విషాదం
ముత్యాలనాయుడు (ఫైల్‌ ఫొటో)

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుని మృతి

- మృతుడి స్వగ్రామం దేవరాపల్లి మండలం వెంకటరాజపురం

- ప్రస్తుతం మల్కాపురం సమీపం నక్కవానిపాలెంలో ఆటోమొబైల్‌ షాపు పెట్టుకుని జీవనం 

దేవరాపల్లి, మే 21 : ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన దేవరాపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలివి. మండలంలోని వెంకటరాజపురం గ్రామానికి చెందిన లెక్కల ముత్యాలనాయుడు (28) మల్కాపురం సమీపంలోని నక్కవానిపాలెంలో ఆటోమొబైల్‌ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తుండేవాడు. ఇటీవల తన తల్లి మృతి చెందింది. గతంలో ఆమె పేరిట బ్యాంకులో బంగారు వస్తువులను తాకట్టు పెట్టారు. సదరు బ్యాంకుకు సమర్పించేందుకు లీగల్‌హెయిర్‌ సర్టిఫికెట్‌ కోసం స్వగ్రామం వెంకటరాజపురానికి  శనివారం బైక్‌పై వస్తుండగా, దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద విశాఖపట్నం వెళ్తున్న 12డి బస్సు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో 108కు ఫోన్‌ చేసినా అరగంట వరకు వాహనం రాలేదు. దీంతో  ఇక్కడి పీహెచ్‌సీకి తరలించగా, పరిస్థితి విషమించడంతో ఆటోలో విశాఖపట్నం తీసుకు వెళుతుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.  భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పి.సింహాచలం తెలిపారు. 

గ్రామంలో  విషాద ఛాయలు 

 ముత్యాలనాయుడుకు గత ఏడాది ఆగస్టులో నర్సీపట్నం సమీపం బలిఘట్టానికి చెందిన పావనితో వివాహం జరిగింది. బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లి అక్కడ మెడికల్‌ రిప్రజెంటెటివ్‌గా పని చేసేవాడు. తన తండ్రికి పాము కాటు వేసిందన్న సమాచారంంతో మూడేళ్ల కిందట స్వగ్రామానికి విచ్చేశాడు. తండ్రి కోలుకున్న అనంతరం తల్లికి మూత్రపిండాల వ్యాధి రావడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్సలు చేయించాడు. అయినప్పటికీ ఆమె దక్కలేదు. గ్రామంలో ఉన్న భూమిని కౌలుకు ఇచ్చి  తండ్రి, భార్యతో నక్కవానిపాలెం వెళ్లి ఆటోమొబైల్‌ షాప్‌ పెట్టుకుని జీవనం సాగించేవాడు. రోడ్డు ప్రమాదంలో ముత్యాలనాయుడు మృతిచెందడంతో ప్రస్తుతం ఆ కుటుంబ రోడ్డున పడినట్టైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Updated Date - 2022-05-22T06:47:45+05:30 IST