రాష్ట్రంలో పారిశ్రామిక, తయారీ వ్యవస్థ భేష్
ABN , First Publish Date - 2022-04-26T13:01:14+05:30 IST
రాష్ట్రంలో పారిశ్రామిక, తయారీ వ్యవస్థ ఏర్పాటు భేషుగ్గా వుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభినందించారు. సోమవారం చెన్నైలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
చెన్నై: రాష్ట్రంలో పారిశ్రామిక, తయారీ వ్యవస్థ ఏర్పాటు భేషుగ్గా వుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభినందించారు. సోమవారం చెన్నైలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), ఎగుమతి సంబంధిత యూనిట్ (ఈఓయూ)లకు సంబంధించి ‘ఎక్స్పోర్ట్ ఎక్స్లెన్స్’ అవార్డులను వెంకయ్య అందించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఎస్ఈజెడ్లు, ఈఓయూలు దేశ ఎగుమతుల వ్యవస్థలో మూడోవంతు ఎగుమతులు చేపడుతుండడం ప్రశంసనీయమన్నారు. మేకిన్ ఇండియా, లోకల్ టు గ్లోబల్, వ్యాపారానుకూల వాతావరణం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి వాటిని ప్రోత్సహించేందుకు ఎస్ఈజెడ్లు చక్కటి వేదికలుగా ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 418 బిలియన్ అమెరికన్ డాలర్ల రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం శుభపరిణామమన్నారు. సేవా రంగంలోనూ 250 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదవడాన్ని అభినందించారు. కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో ఎగుమతులు జరగడంలో భాగస్వాములైన అందరినీ అభినందించారు.
ఈ ధోరణి కొనసాగించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జిల్లా కేంద్రాలను ‘జిల్లా ఎగుమతి కేంద్రం’గా మార్చాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం ద్వారా మన దేశంలో ఎగుమతులు మరింత ఊపందుకుంటాయన్నారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు వ్యాపారానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, పరిశ్రమలకు అనువైన విధానాలు తీసుకురావడం వంటివాటిపై కేంద్రం దృష్టి సారించిందని, తద్వారా ‘లోకల్ టు గ్లోబల్’కు ఊతం అందుతుందని అన్నారు. జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ వున్న ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మరింత చొరవ తీసుకోవాలని ఎగుమతిదారులకు సూచించారు. భారతదేశంలో యువత శక్తిసామర్థ్యాలకు కొదువలేదని, దాన్ని గుర్తించి సరైన నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా దేశ పురోగతిలో వారిని భాగస్వాములు చేయాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. తమిళనాడులో పారిశ్రామిక, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం ఉందన్న ఉపరాష్ట్రపతి.. ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్ర, తోలు పరిశ్రమలు, చిన్న, భారీ ఇంజనీరింగ్ ఉపకరణాలు, పంపులు, మోటార్లు, ఎలక్ట్రానిక్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తదితర రంగాల్లో తమిళనాడు సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియాసింగ్ పటేల్, తమిళనాడు మంత్రి రామచంద్రన్, మద్రాస్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎస్ఈజడ్ డెవల్పమెంట్ కమిషనర్ డాక్టర్ ఎంకే షణ్ముగసుందరం, జాయింట్ డెవల్పమెంట్ కమిషనర్ అలెక్స్పాల్ సుందరంతో పాటు ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.