విశాఖ రైల్వేస్టేషన్కు ‘ఈట్ రైట్’ గుర్తింపు
ABN , First Publish Date - 2022-05-20T08:42:21+05:30 IST
విశాఖపట్నం రైల్వేస్టేషన్లో విక్రయించే ఆహార పదార్థాలను ఎటువంటి సందేహం, భయం లేకుండా ఎంచక్కా తినేయవచ్చని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం రైల్వేస్టేషన్లో విక్రయించే ఆహార పదార్థాలను ఎటువంటి సందేహం, భయం లేకుండా ఎంచక్కా తినేయవచ్చని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎ్సఎ్సఏఐ) సర్టిఫై చేసింది. విశాఖను ‘ఈట్ రైట్’ స్టేషన్గా గుర్తిస్తూ.. ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి గుర్తింపు పొందిన రైల్వేస్టేషన్లు ఆరు (చండీగఢ్, ఢిల్లీ-ఆనంద విహార్, ముంబై-ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై-సెంట్రల్ రైల్వేస్టేషన్, వడోదరా, భువనేశ్వర్) మాత్రమే ఉండగా.. తాజాగా ఆ జాబితాలో విశాఖపట్నం కూడా చేరింది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి రైల్వేస్టేషన్ ఇదే కావడం మరో విశేషం.
శుభ్రత, నాణ్యత పాటించేలా జాగ్రత్తలు
విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆహార పదార్థాలు విక్రయించే స్టాళ్లు సుమారు 50 వరకు ఉన్నాయి. అన్నింటిలోనూ శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి ఒక్క స్టాల్కు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశాం. విక్రేతలకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తాం. ఈ చర్యల వల్లే ఫోర్ స్టార్ రేటింగ్ వచ్చింది. ఒక్క విశాఖపట్నమే కాకుండా మిగిలిన స్టేషన్లలోనూ ఇవే ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపడుతున్నాం.
- అనూప్ కుమార్, డీఆర్ఎం, విశాఖపట్నం