చెట్టుకు బైక్ ఢీకొని చేపల వ్యాపారి మృతి
ABN , First Publish Date - 2020-02-20T08:28:51+05:30 IST
మండలంలోని లింగాలతిరుగుడు గ్రామం వద్ద సబ్బవరం-చోడవరం రోడ్డులో ఈ నెల 17న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో చేపల వ్యాపారి మృతి చెందాడు.
సబ్బవరం, ఫిబ్రవరి 19 : మండలంలోని లింగాలతిరుగుడు గ్రామం వద్ద సబ్బవరం-చోడవరం రోడ్డులో ఈ నెల 17న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో చేపల వ్యాపారి మృతి చెందాడు. అయితే బైక్తో పాటు మృతదేహం రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోవడంతో ఈ ప్రమాద విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో మూడు రోజులుగా మృతదేహం తుప్పల్లోనే ఉండిపోయింది. బుధవారం అటుగా వెళుతున్న మృతుడి బంధువు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో ప్రమాద విషయం తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రోలుగుంటకు చెందిన వనం సర్వేశ్వరరావు చేపల వ్యాపారి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఎప్పటికప్పుడు చేపలు తెచ్చి స్థానికంగా విక్రయిస్తూ ఉంటారు. ఈ నెల 17న ఉదయం 3 గంటలకు రోలుగుంట నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేపలు తెచ్చేందుకు బైక్పై బయలుదేరారు. అయితే ఆ రోజు సాయంత్రం వరకూ ఇంటికి చేరలేదు. ఆందోళనకు గురైన అతడి భార్య భవానీ భర్త సెల్కు ఫోన్ చేసింది. ఫోన్ మోగలేదు. దీంతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కు వెళ్లి వాకబు చేసినా భర్త ఆచూకీ గురించి తెలియలేదు. సోమవారం సర్వేశ్వరరావు హార్బర్కు రాలేదని అక్కడి చేపల వ్యాపారులు చెప్పారు. బంఽధువులు, తెలిసిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వెతికినా ప్రయోజనం లేకపోయింది.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం లింగాలతిరుగుడు వద్ద రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో సర్వేశ్వరరావు అచేతనంగా పడి ఉన్నట్టు భవానీకి వారి బంధువు అంగటి నాయుడు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అక్కడకు వెళ్లి చూడగా సర్వేశ్వరరావు మృతదేహ ం పడి ఉంది. భార్య ఫిర్యాదు మేరకు సబ్బవరం సీఐ చంద్రశేఖరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సర్వేశ్వరరావు బైక్ చెట్టుకు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.