కరోనాను అడ్డంపెట్టుకుని ఇంజెక్షన్ల దందాకు తెర
ABN , First Publish Date - 2021-05-17T16:23:02+05:30 IST
కరోనాను అడ్డంపెట్టుకుని మార్కెట్లలో ఇంజెక్షన్ల దందాకు పాల్పడుతున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం: కరోనాను అడ్డంపెట్టుకుని మార్కెట్లలో ఇంజెక్షన్ల దందాకు పాల్పడుతున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజక్షన్ల ముఠాపై డ్రగ్ కంట్రోల్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా "డెకాయ్ ఆపరేషన్"ను నిర్వహించింది. ఈ క్రమంలో ప్రసన్నకుమార్, రమ్యకృష్ణ కలిసి బెవాసిజుమాబ్, టోసిలుజుమాబ్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో మూడు లక్షలకు అమ్మిన్నట్లు గుర్తించారు. డెకాయ్ ఆపరేషన్ టీంకు సమాచారం అందడంతో ప్రసన్న కుమార్ ముఠాపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బెవాసిజుమాబ్ ఇంజక్షన్ కావాలంటూ ప్రసన్నకుమార్ను డ్రగ్ కంట్రోల్ అధికారులు కళ్యాణి, సునీత సంప్రదించారు. రెండు ఇంజక్షన్లకు రూ.1,50,000 తేవాలని ఫోన్లో ముఠా సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్లను ఇచ్చేందుకు శాంతిపురం చేరుకున్న ప్రసన్న కుమార్, రమ్యకృష్ణలను డెకాయ్ ఆపరేషన్ టీం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు నుంచి ఇంజెక్షన్ల స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేశారు.