AP News: విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీపై మళ్లీ పాత పాటే పాడిన కేంద్రం

ABN , First Publish Date - 2022-07-26T01:09:03+05:30 IST

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ (Visakha Steel Factory)పై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మళ్లీ పాత పాటే పాడింది.

AP News: విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీపై మళ్లీ పాత పాటే పాడిన కేంద్రం

ఢిల్లీ: విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ (Visakha Steel Factory)పై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మళ్లీ పాత పాటే పాడింది. లాభాలు వస్తున్నాయంటూనే ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఫగన్‌సింగ్ (Union minister Faggan Singh) ఇలా సమాధానమిచ్చారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.913.19 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. కొత్త ప్రభుత్వరంగ సంస్థ విధానం మేరకు వ్యూహాత్మకేతర పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సొంత గనుల కోసం ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh), ఒడిషాలను కేంద్ర ఉక్కుశాఖ కోరిందని కేంద్రమంత్రి ఫగన్‌సింగ్ పేర్కొన్నారు. 


విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం అన్ని విధాలుగా ఇబ్బంది పడుతోంది. ముడి పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. అమ్మకాలు పడిపోయాయి. ఆర్థిక వనరుల సమస్య తలెత్తింది. అన్నీ సమకూర్చుకొని పూర్తిస్థాయి ఉత్పత్తి జరగాలంటే... కనీసం రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు అవసరం. బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం భూమి తనఖా పెట్టి రుణం తెద్దామనుకున్నా...ఎకరా భూమి కూడా విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు పేరు మీద లేదు. అంతా భారత రాష్ట్రపతి పేరు మీదే ఉంది. ప్లాంటులో కేవలం యంత్రాలు, భవనాలు మాత్రమే ప్లాంటు ఆస్తి. వాటి పుస్తకపు విలువ ఆరు నెలల క్రితం రూ.3,100 కోట్లుగా లెక్క కట్టారు. ఇటీవల వరుసగా వచ్చిన నష్టాలతో ఆ విలువ కూడా తగ్గిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో అన్నీ సక్రమంగా నడవాలంటే నెలకు రూ.1,200 కోట్లు కావాలి. ఫిక్స్‌డ్‌ ఖర్చులు రూ.550 కోట్లు. బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు నెలవారీ చెల్లించాల్సిన వడ్డీ రూ.400 కోట్లు. జీతాలకు మరో రూ.200 కోట్లు ఉండాలి. అన్నీ కలిపి రూ.1,200. నెలకు కనీసం రూ.2 వేల కోట్ల విలువైన ఉక్కు ఉత్పత్తులు విక్రయిస్తే...దేనికీ ఇబ్బంది ఉండదు. అంటే సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల టన్నుల ఉత్పత్తులు అమ్మాలి. ఇందుకోసం నెలకు 5.5 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రోజుకు 8 వేల టన్నుల చొప్పున నెలకు 2.5 లక్షల టన్నులే తయారవుతోంది. ప్లాంటు సామర్థ్యం కంటే తక్కువ ఉక్కు తయారైతే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. మార్కెట్‌లో నష్టానికి అమ్మాల్సి వస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో అన్నింటినీ సమకూర్చుకొని మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులను పూర్తిస్థాయిలో పనిచేయించేందుకు కనీసం రూ.5 వేల కోట్లు అయినా కేంద్రం సాయం చేయాలని ఉక్కు అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తోంది.

Updated Date - 2022-07-26T01:09:03+05:30 IST