విశాఖ ప్రమాదం నుంచి శ్రీనివాస్ తప్పించుకున్నారా..!?

ABN , First Publish Date - 2020-07-14T12:28:30+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో

విశాఖ ప్రమాదం నుంచి శ్రీనివాస్ తప్పించుకున్నారా..!?

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ భారీ పేలుడుతో వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయని.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అసలు ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది విధుల్లో ఉన్నారనే విషయాన్ని కూడా ఇంతవరకూ తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.


శ్రీనివాస్ ఏమయ్యారు..!?

అయితే అనకాపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇదే కంపెనీలో పనిచేస్తుంటారని.. రాత్రి నుంచి ఆయన ఆచూకీ తెలియట్లేదని కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన అనకాపల్లి నుంచి ఘటనాస్థలికి వచ్చి శ్రీనివాస్ గురించి ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని అడగ్గా సరైన సమాధానం ఇవ్వడం లేదని.. కనీసం సీసీ ఫుటేజీ చూపించట్లేదని వారు చెబుతున్నారు. ఇంతకీ ప్రమాదం నుంచి శ్రీనివాస్ తప్పించుకున్నారా..? లేక ఏమైపోయారు..? అనే విషయం తెలియట్లేదు.


అయితే.. ప్రమాదంలో గాయపడ్డవారిలో శ్రీనివాస్ ఉన్నారని అయితే ఆయన తమ శ్రీనివాస్ కాదని అనకాపల్లి నుంచి వచ్చిన వారు చెబుతున్నారు. ఈ కన్ఫూజన్‌తో అసలేం జరిగుంటుందని కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫోన్‌ రింగ్ అవుతోంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదని కుటుంబీకులు భయపడుతున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు అందరూ డ్యూటీలో ఉన్నవారంతా బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారని.. ఇందులో ఒకరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని కొందరు చెబుతున్నారు. శ్రీనివాస్ ఫోన్ రింగ్ అవుతుండటంతో ఆయన క్షేమంగానే ఉన్నారని తాము భావిస్తున్నామని బంధువులు చెబుతున్నారు.



Updated Date - 2020-07-14T12:28:30+05:30 IST