కొత్త ప్రాంతాలకూ వైరస్
ABN , First Publish Date - 2020-05-27T09:55:57+05:30 IST
పురంలోని కొత్త ప్రాంతాలకూ కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కాంటాక్ట్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
హిందూపురంలో తగ్గని ఉధృతి..
తాజాగా భార్యాభర్తలకు పాజిటివ్..
166కి చేరిన బాధితుల సంఖ్య..
హిందూపురం టౌన్, మే 26: పురంలోని కొత్త ప్రాంతాలకూ కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కాంటాక్ట్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం మెయిన్ బజార్లోని భార్యాభర్తలకు వైరస్ సోకింది. కరోనా బారిన పడిన వారిలో ఒకరు అధికార పార్టీ ఆధ్యర్యంలో పట్టణంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. దీంతో అధికార పార్టీ నాయకులకు కాంటాక్ట్ టెన్షన్ పట్టుకుంది.
వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ రోజు ఎన్ని నమోదవుతాయోనన్న భయం పట్టణ ప్రజలను వెంటాడుతోంది. కొన్ని కేసుల్లో లింకులు కూడా సరిగా దొరకట్లేదని అధికారులు తలలు బాదుకుంటున్నారు. హిందూపురంలో మొదటి పాజిటివ్ కేసు మార్చి 29న బయటపడింది. మంగళవారం నాటికి పట్టణ వాసులు 139 మంది, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటకకు చెందిన 27 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 166కి చేరింది. లాక్డౌన్ అమలులోకి వచ్చి రెండు నెలలు దాటినా కేసులు మాత్రం తగ్గట్లేదు.