వైరస్ డేంజర్ బెల్స్
ABN , First Publish Date - 2020-07-01T10:17:56+05:30 IST
కరోనా వైరస్ మరింత వేగంగా జిల్లాలో విస్తరిస్తోంది. ఏరోజుకారోజు కేసుల సంఖ్య ఎగబాకుతూనే ఉంది. పాత కంటైన్మెంట్ ప్రాంతాలతోపాటు
పెరుగుతున్న ఆకస్మిక మరణాలు
ఏలూరులో ఏడు వందలకు చేరువ
వణుకుతున్న పల్లెలు.. పట్టణాలు
ప్రభుత్వ కార్యాలయాల్లో మరింత కట్టడి
ఒక్కరోజే 84 మందికి పాజిటివ్..
1,451కు చేరిన కేసులు
ఏలూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ మరింత వేగంగా జిల్లాలో విస్తరిస్తోంది. ఏరోజుకారోజు కేసుల సంఖ్య ఎగబాకుతూనే ఉంది. పాత కంటైన్మెంట్ ప్రాంతాలతోపాటు కొత్తగా మరిన్ని గ్రామాలకు వైరస్ విస్తరిస్తోంది. సోమవారం ఒక్కరోజే 84 కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య 1,443కు చేరింది. ఏలూరులోని అశోక్నగర్, వెంకటాపురం, యాదవ నగర్, తంగెళ్లమూడి, తూర్పు వీధి, కంకణాల వారి వీధి, అగ్ర హారం, చోడిదిబ్బ, శేఖర్వీధి, ప్రభుత్వాసుపత్రి వెనుక, రాఘవా సామిల్లు వద్ద, ఎన్ఆర్ పేట, పాములదిబ్బ, మోతేవారితోట, చేపలతూము, బాలయోగివంతెన, 33వ డివిజన్, రావిచెట్టు వీధి, బూరాయి గూడెం, ఆర్ఆర్ పేటలతో కలిపి మంగళ వారం ఒక్కరోజే 42 కేసులను నిర్ధారించారు. ఓ వైపు వన్టౌన్ లాక్డౌన్లో ఉండగానే మరోవైపు టూ టౌన్లోనూ కొత్తగా కేసులు బయటపడుతున్నాయి.
ఇవిగాక సింగరాజుపాలెంలో రెండు, బూరాయిగూడెంలో తొమ్మిది, పెదవేగి మండలం పిన కడిమిలో ఒకటి, పోడూరు మండలం జిన్నూరులో రెండు, సరిపల్లి, ముసళ్ళకుంట, హనుమాన్ జంక్షన్, పెదపాడు మం డలం వట్లూరు, గణపవరం మండలం అర్ధవరం, లింగపా లెం, భీమడోలు మండలం గుండుగొలను, నర్సన్నపాలెం, దిరు సుమర్రు, పాలకొల్లు, నిడదవోలు, తూర్పు తాళ్లు, నేలమూరు, వీరవాసరం, భీమవరంలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మీద కలిపి 84 కేసులు నమోదయ్యాయి. ఉద్యోగులు, వ్యాపారులు, రోజువారీ వేతన కార్మికులు వైరస్కు గురయ్యారు.
ఏలూరులో.. ఏడు వందలకు చేరువ
తాజా పరిస్థితి అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో అనేక ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకా రం ఒక్క ఏలూరులోనే పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వంద లకు చేరువలో ఉన్నాయి. రెండు నెలల క్రితం జిల్లావ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఈ సంఖ్య నాలుగో వంతుగా ఉండ గా... ఇప్పుడు జిల్లాలో సగభాగాన్ని ఆక్రమించింది.
విస్తరణకు కారణాలు అన్వేషణ
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా వైరస్ దూకుడు తగ్గకపో వడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఏలూరులో కట్టడి చేయడంలో జరిగిన వైఫల్యాలను బేరీజు వేస్తున్నారు. లాక్డౌన్ పూర్తి సడలింపుల తర్వాత వన్టౌన్లో వ్యాపార లావాదేవీలు జోరుగా సాగడంతో జనం కొనుగోళ్లలో విరగబడి వ్యవహరించడం వల్లే నగరంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమించింది. వైరస్ సోకిన వ్యక్తి అప్రమత్తంగా లేని కారణంగా అర డజను మంది వరకూ కేసుల పరిధి విస్తరించింది. కుటుంబ సభ్యులు అనేకమంది ఆసుపత్రి పాల వ్వాల్సి వచ్చింది. నగరం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోళ్లకు జనం తరలిరావడంతో ఒకరి నుంచి ఒకరి వైరస్ వేగంగా సంక్రమించినట్లు గమనించారు.
ఈ కారణంగా ఇతరచోట్ల కొనుగోళ్లలో భౌతిక దూరం పాటించకపోవడం, కొవి డ్ నియమాలకు విరుద్దంగా ఉండడం వంటి చర్యలే కారణ మని చెబుతున్నారు. ఈ కారణం గా నాలుగు రోజులుగా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాం టి కేసులన్నింటిలోనూ మృతులకు పరీక్ష లు నిర్వహిస్తే పాజిటివ్గా నిర్ధారణ కావడానికి ఇదో కారణంగా చెబుతున్నారు. నమూనాల పరీక్షల్లో మూడో వంతు పాజిటివ్లు నిర్ధారణ కావడం ఇప్పుడు మరింత ఆం దోళన కలిగిస్తోంది. ఇకపై వృద్ధులు, గుండె సంబంధిత, ఇత రత్రా వ్యాధులతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గడప దాటకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వైరస్ మరింతగా విస్తరించే అవకాశాలు స్పష్టంగా ఉండడంతో పాటు క్వారంటైన్ లలో ఉన్న వారికి తాజాగా పౌష్టికాహా రం అందించడంలోనూ కాస్తంత శ్రద్ధ తగ్గినట్లే కనిపిస్తోంది.
ఐసొలేషన్ వార్డుల్లోని వారు అడపాదడపా తమ వారికి ఫోన్ చేసి అందుతున్న వైద్యసాయం, తీసుకుంటు న్న జాగ్రత్తలపై ఒకింత అసంతృప్తి వ్య క్తం చేస్తున్నారు. ఇదే వార్డుల్లో దీర్ఘకాలి కంగా సేవలందిస్తున్న వారు విసిగి వేసారిన కారణంగానే ఇలాంటి పరిస్థి తులు తలెత్తుతున్నాయన్న వాదన లేకపో లేదు. ఈ పరిణామాలన్నింటిపైనా అధికారు లు దృష్టిపెట్టాలి. తాజాగా ప్రభుత్వ కార్యాల యాలు, పోలీస్ స్టేషన్లలోనూ కరోనా వైరస్ జాగ్రత్త లు మరింత విస్తృతం చేశారు.
23 కొత్త కంటైన్మెంట్లు
వైరస్ తీవ్రంగా మారడంతో అధికారులు కొత్త కంటైన్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 230 పైగా కంటైన్మెంట్లు ఉండగా మంగళవారం మరో 23 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏలూరు అర్బన్ పరిధిలో పిచ్చి కులగుంట, ఏలూరు రూరల్లో శ్రీపర్రు, కొమడవోలులోని తూర్పులాకులు, మాదేపల్లిలోని వాడపల్లి వీధి, భీమవరం రూరల్ నర్సింహాపురం, అర్బన్ పరిధిలోని రైల్వేస్టేషన్ దగ్గర, 37వ వార్డు, చినపేటలోని 23వ వార్డు, కుమ్మర్లవీధి, తాడే పల్లిగూడెం అర్బన్లోని శేషమహల్ థియేటర్ వెనుక, ద్వారకా తిరుమలలో తూర్పువీధి, దెందులూరు మండలం పులిచిత్ర చెరువుగట్టు, దెందులూరులోని సినిమాహాల్ సెంటర్, గాలా యిగూడెంలో ఎంపీపీ స్కూల్ దగ్గర, పెనుమంట్ర మండలం నెలమూరు, దేవరపల్లి మండలం దుద్దుకూరు, కొవ్వూరు అర్బన్ పరిధిలో ఔరంగాబాదు, ఉంగుటూరు మండలం చిన వెలమిల్లి, పెనుగొండ మండలం దేవ, ఉండి మండలం కండ్రి క, పాందువ్వ, యలమంచిలి మండలం వర్ధిలంక, నరసాపురం రూరల్ లక్ష్మణేశ్వరంలలో కంటైన్మెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటించారు.
దీనికి తగ్గట్టుగానే అన్ని నియమాలను పాటించాలని, ఆయా ప్రాంతాల్లో అవసరమైన వస్తువులు, నిత్యావసరాలు ఇళ్లకే సరఫరా చేస్తారని చెప్పారు.