కోవిడ్పై అసెంబ్లీ అధికారుల వర్చువల్ సమావేశం ఈ నెల 19న
ABN , First Publish Date - 2021-04-15T22:54:55+05:30 IST
దేశంలోని చట్ట సభల ప్రిసైడింగ్ అధికారుల వర్చువల్ సమావేశం
న్యూఢిల్లీ : దేశంలోని చట్ట సభల ప్రిసైడింగ్ అధికారుల వర్చువల్ సమావేశం ఈ నెల 19న జరుగుతుంది. ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు.
దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి, ప్రజా ప్రతినిధుల బాధ్యత, పోషించవలసిన పాత్రల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని గురువారం విడుదలైన ఓ అధికార ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాల శాసన సభల ప్రిసైడింగ్ అధికారులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, చీఫ్ విప్లు, రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు పాల్గొంటారని తెలిపింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల్లో 2,00,739 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మన దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,40,74,564. వీటిలో యాక్టివ్ కేసులు 14,71,877.