షాకింగ్: రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా తొలగించాలని సెలక్షన్ కమిటీని కోరిన కోహ్లీ!

ABN , First Publish Date - 2021-09-18T00:48:47+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమేనా? రోహిత్

షాకింగ్: రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా తొలగించాలని సెలక్షన్ కమిటీని కోరిన కోహ్లీ!

న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమేనా? రోహిత్ అంటే కోహ్లీకి మొదటి నుంచి పడడం లేదా? వీరిద్దరి మధ్య సఖ్యత లేదని గతంలో వచ్చిన వార్తలకు బలం చేకూర్చేలా బీసీసీఐకి కోహ్లీ చేసిన ఓ సూచన వెలుగులోకి వచ్చింది. నిజానికి భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూసే. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ బీసీసీఐకి ఓ షాకింగ్ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోహ్లీ కోరినట్టు సమాచారం. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌లలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నవంబరు 14 వరకు జరుగుతుంది. ఈ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ కనుక టీ20 ప్రపంచకప్‌ను గెలవకుంటే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి వన్డే, టీ20లకు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. 


కోహ్లీ నిన్న (గురువారం) ఓ ప్రకటన చేస్తూ టీ20 కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటానని, వన్డే, టెస్టు జట్టుకు మాత్రం కెప్టెన్‌గానే ఉంటానని స్పష్టం చేశాడు. అయితే, తాజా రిపోర్టు ప్రకారం కోహ్లీ వన్డే కెప్టెన్సీ కూడా అంత సేఫ్‌గా లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రోహిత్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐకి సూచన చేసిన తర్వాత అతడి కెప్టెన్సీ మరింత ప్రమాదంలో పడిందని చెబుతున్నారు. 


రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని సూచించిన తర్వాత విరాట్ కోహ్లీ నిజమైన వారసుడిని కోరుకోలేదని బోర్డు వర్గాలు అభిప్రాయపడినట్టు కూడా చెబుతున్నారు. కాగా, రోహిత్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని బోర్డుకు సూచించిన కోహ్లీ.. రెండు ఫార్మాట్లలోనూ యువకులైన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి వారికి దానిని అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది.  

 

 


Updated Date - 2021-09-18T00:48:47+05:30 IST