వందో టెస్టు ఆడతానని అనుకోలేదు: విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2022-03-04T01:09:56+05:30 IST

రికార్డుల రారాజు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు అందుకునేందుకు సిద్ధమయ్యాడు..

వందో టెస్టు ఆడతానని అనుకోలేదు: విరాట్ కోహ్లీ

మొహాలీ: రికార్డుల రారాజు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్న తొలి టెస్టు కోహ్లీ క్రికెట్ జీవితంలో అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది.


ఈ టెస్టుతో వంద టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కబోతున్నాడు. 2011లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లీ ఆ మ్యాచ్‌లో చేసింది 4, 15 పరుగులు మాత్రమే. ఈ దశాబ్ద కాలంలో కోహ్లీ ఎన్నో మైలురాళ్లు అధిగమించాడు. టెస్టుల్లో మొత్తంగా 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. 


చారిత్రక టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న కోహ్లీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద టెస్టు మ్యాచ్‌లు ఆడతానని తానెప్పుడూ అనుకోలేదన్నాడు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణమని పేర్కొన్న వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది.


ఈ టెస్టుతో.. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ సరసన కోహ్లీ చేరనున్నాడు. కోహ్లీ వందో టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. 

Updated Date - 2022-03-04T01:09:56+05:30 IST