మెరిసిన కోహ్లీ

ABN , First Publish Date - 2022-05-20T10:14:35+05:30 IST

చావోరేవో మ్యాచ్‌లో నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

మెరిసిన కోహ్లీ

రేసులోనే బెంగళూరు 

 8 వికెట్లతో గుజరాత్‌ ఓటమి

ముంబై: చావోరేవో మ్యాచ్‌లో నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73) కీలక మ్యాచ్‌లో అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. తొలుత గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 నాటౌట్‌), మిల్లర్‌ (34), సాహా (31) రాణించారు. హాజెల్‌వుడ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


కోహ్లీ, డుప్లెసి (38 బంతుల్లో 5 ఫోర్లతో 44) చాలెంజర్స్‌ తరఫున ఈ సీజన్‌లో తొలి వికెట్‌కు అత్యధికంగా 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్‌) ధనాధన్‌ షాట్లతో అలరించాడు. రషీద్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో బెంగళూరు మొత్తం 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. పంజాబ్‌, హైదరాబాద్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ నుంచి అవుటయ్యాయి.  ఇక, శనివారం ఢిల్లీ-ముంబై మ్యాచ్‌పైనే బెంగళూరు నాకౌట్‌ అదృష్టం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే.. డుప్లెసి సేన పనైపోయినట్లే..! 


సంక్షిప్త స్కోర్లు:

గుజరాత్‌:

20 ఓవర్లలో 168/5 (హార్దిక్‌ పాండ్యా 62 నాటౌట్‌, మిల్లర్‌ 34; హాజెల్‌వుడ్‌ 2/39). 

బెంగళూరు:

18.4 ఓవర్లలో 170/2 (కోహ్లీ 73, డుప్లెసి 44; రషీద్‌ 2/32). 

Updated Date - 2022-05-20T10:14:35+05:30 IST