Virat Kohli: 'ప్లీజ్.. కోహ్లీ నీవు రిటైర్ అయ్యేలోపు మా గడ్డపై ఒక్కసారైనా ఆడు'.. ఓ పాక్ అభిమాని అభ్యర్థన

ABN , First Publish Date - 2022-10-01T18:25:03+05:30 IST

రన్‌మెషిన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటకు ఫిదాకాని క్రికెట్ అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు.

Virat Kohli: 'ప్లీజ్.. కోహ్లీ నీవు రిటైర్ అయ్యేలోపు మా గడ్డపై ఒక్కసారైనా ఆడు'.. ఓ పాక్ అభిమాని అభ్యర్థన

ఇంటర్నెట్ డెస్క్: రన్‌మెషిన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటకు ఫిదాకాని క్రికెట్ అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మైదానంలో అడుగుపెడుతుంటే ఎలా స్టేడియం మొత్తం 'సచిన్.. సచిన్' అంటూ మారుమోగేదో.. ఇప్పుడు కింగ్ కోహ్లీ బ్యాటింగ్ దిగుతుంటే అభిమానులు అచ్చం అలాగే అరుస్తుంటారు. అంతలా తన ఆటతో అభిమానులను ఆకట్టుకున్నాడు కోహ్లీ. ఇక దాయాది పాకిస్థాన్‌ (Pakistan)లోనూ విరాట్‌కు వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఏ జట్టుతో మ్యాచ్ ఆడినా.. ఆ దేశ అభిమానులు మాత్రం కోహ్లీ గురించి ఫ్లడ్‌కార్డులు ప్రదర్శిస్తుంటారు. అంతలా కోహ్లీని అభిమానిస్తారు పాకిస్తానీ ఫ్యాన్స్. 


ఇప్పటికే పలుమార్లు ఇలాంటి ఫ్లడ్‌కార్డు ప్రదర్శనలు చూశాం. తాజాగా ఇంగ్లండ్‌ (England)తో స్వదేశంలో పాక్ ఆడుతున్న టీ20 సిరీస్‌లోనూ ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. శుక్రవారం గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లండ్‌, పాకిస్థాన్ ఆరో టీ20లో తలపడ్డాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రదర్శించిన ఫ్లడ్‌కార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో ఒక్కసారిగా మైదానంలోని కెమెరాలన్నీ అతని వైపే తిరిగాయి. ఇంతకీ ఆ అభిమాని ప్రదర్శించిన ఫ్లడ్‌కార్డులో ఏముందంటే.. "కోహ్లీ.. నీవు రిటైర్ అయ్యేలోపు పాకిస్థాన్‌లో ఒక్కసారైనా ఆడాలి".. ఇది ఆ పాకిస్థానీ ఫ్యాన్ అభ్యర్థన. 


ఇదిలాఉంటే.. కోహ్లీ ఇప్పటివరకు టీమిండియా తరఫున 102 టెస్టులు, 262 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 71 అంతర్జాతీయ సెంచరీలు బాదాడు. కానీ, ఒక్క మ్యాచ్ కూడా పాకిస్థాన్ గడ్డపై ఆడలేదు. దీనికి కారణం భారత జట్టు 2006 తర్వాత నుంచి ఆ దేశంలో పర్యటించకపోవడమే. మధ్యలో కొన్ని అంతర్జాతీయ టోర్నీల సందర్భంగా దాయాది జట్టు భారత్‌లో ఆడింది. కానీ, టీమిండియా మాత్రం ఆ దేశంలో అడుగు పెట్టలేదు. దీంతో కోహ్లీకి పాక్‌లో ఆడే అవకాశం రాలేదు. 


అందుకే పాక్ అభిమానులు విరాట్ ఒక్కసారి తమ గడ్డపై ఆడితే చూసి తరిద్దమనే నిరీక్షణలో ఉన్నారు. కానీ, వారి ఆశ ఇప్పట్లోనైతే తీరేది కాదు. అటు కోహ్లీ వయసు కూడా పెరుగుతోంది. మహా అయితే ఇంకో మూడు నాలుగేళ్లు ఆడొచ్చు. ఆ లోపు ఇరు దేశాల మధ్య ఉన్న వైరాలన్నీ తొలిగి, సయోధ్య కుదిరితే.. పాక్ అభిమానుల ఆశ తీరేందుకు అవకాశం ఉంది. లేకపోతే అంతే సంగతులు. ఇక ఇక్కడ చెప్పుకొవాల్సిన మరో విషయం ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా టెస్టు క్రికెట్ ఆడే దేశాలన్నింటిలో ఆడిన కింగ్ కోహ్లీ.. పాక్ గడ్డపై మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.   




Updated Date - 2022-10-01T18:25:03+05:30 IST