టీ20ల్లో రోహిత్‌శర్మ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2022-02-19T22:03:36+05:30 IST

ఒకప్పుడు పరుగుల వరద పారించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క

టీ20ల్లో రోహిత్‌శర్మ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

కోల్‌కతా: ఒకప్పుడు పరుగుల వరద పారించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న కోహ్లీ వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ20లో అర్ధ సెంచరీ నమోదు చేసి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. రోస్టన్ చేజ్ బౌలింగులో లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన కోహ్లీ తన ఖాతాలో 30వ అర్ధ సెంచరీని వేసుకున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన రోహిత్‌శర్మ సరసన చేరాడు. రోహిత్ 113 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ తన 89వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. 


ఇక ఈ జాబితాలో 26 అర్ధ సెంచరీలతో బాబర్ ఆజం మూడో స్థానంలో ఉండగా, మార్టిన్ గప్టిల్ (22), డేవిడ్ వార్నర్ (22) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మరో రికార్డు సాధించేందుకు కోహ్లీ కేవలం నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు.


ఈ జాబితాలో మార్టిన్ గప్టిల్ 3,299 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 3,296 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఆదివారం జరగనున్న చివరి టీ20లో ఈ గప్టిల్ రికార్డు బద్దలు కావడం ఖాయం. రోహిత్ శర్మ 3256 పరుగుతో మూడో స్థానంలో ఉన్నాడు.    

Updated Date - 2022-02-19T22:03:36+05:30 IST