కోహ్లీ అత్యంత పాపులర్!
ABN , First Publish Date - 2020-08-11T09:12:28+05:30 IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అతడిని ఫాలో అవుతున్నారు..
గూగుల్లో ఎక్కువ మంది శోధన
అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అతడిని ఫాలో అవుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఎస్ఈఎంఆర్ అనే సంస్థ గూగుల్లో ఎక్కువ మంది శోధించిన క్రికెటర్ ఎవరనే విషయమై అధ్యయనం చేయగా అందులో విరాట్ ప్రజాదరణ ఏస్థాయిలో ఉందో నిరూపితమైంది. ప్రపంచంలో అత్యంత పాపులర్ క్రికెటర్లలో 31 ఏళ్ల విరాట్ టాప్లో నిలిచాడు. విశ్వవ్యాప్తంగా ఈ జనవరి నుంచి జూన్ వరకు గూగుల్లో నెలకు సగటున 16.2 లక్షలసార్లు కోహ్లీ కోసం ఆన్లైన్లో అన్వేషించారు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (9.7 లక్షల సార్లు), ధోనీ (9.4), హార్దిక్ పాండ్యా (7.1), సచిన్ టెండూల్కర్ (6.7) టాప్-10లో నిలిచారు. క్రికెట్ జట్ల కోసం శోధించిన జాబితాలో భారత్ (2.4 లక్షలసార్లు) అగ్రస్థానం దక్కించుకోగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కాగా భారత్ మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఈ జాబితాలో యువరాజ్, శిఖర్ ధవన్లకంటే ముందుగా...అంటే..12వ స్థానంలో నిలవగా, ఆస్ర్టేలియా ఆల్రౌండర్ ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా) 20వ స్థానంలో ఉంది.