తొలి మ్యాచ్లో స్వల్పస్కోర్.. స్మిత్తో పోలుస్తూ కోహ్లీపై విమర్శలు
ABN , First Publish Date - 2020-02-22T00:26:55+05:30 IST
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులకు పెట్టింది పేరు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కోహ్లీ ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సాధించాడు. అయితే టెస్టుల్లో
వెల్లింగ్టన్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులకు పెట్టింది పేరు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కోహ్లీ ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సాధించాడు. అయితే టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్తో విరాట్ కోహ్లీని అభిమానులు తరుచూ పోలుస్తుంటారు. టెస్టుల్లో ఎవరు గొప్పా అటగాడు అనే విషయంలో ఎప్పుడూ చర్చ జరుగుతునే ఉంటుంది. మరోవైపు టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ మొదటి రెండు స్థానాలు వీరిద్దరివే కావడంతో ఈ చర్చ అలాగే కొనసాగుతుంది.
అయితే తరచూ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించే నెటిజన్లు.. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు అనంతరం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ న్యూజిలాండ్ టూర్లో కోహ్లీ ఊహించినంతగా రాణించడం లేదు. ఈ టూర్లో అతను అత్యధిక స్కోర్ 51. తొలి టెస్ట్ మ్యాచ్లోనూ కోహ్లీ కేవలం 2 పరుగులు చేసి.. రాస్ టేలర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టెస్ట్ ఫార్మాట్లో స్మిత్.. కోహ్లీ కంటే ఎంతో ఉత్తమైన ఆటగాడని.. కోహ్లీ కేవలం ఫ్లాట్ పిచ్లపై మాత్రమే పరుగులు చేస్తాడని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శిస్తున్నారు.
వాటిలో కొన్ని ట్వీట్లు:
టెస్ట్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ తొలి 10 బంతుల్లో ఔట్ అవ్వడం ఎప్పటికీ చూడలేరు. కోహ్లీ ఇలాగే ఆడితే.. ఆస్ట్రేలియా మనల్ని కచ్చితంగా వైట్ వాష్ చేస్తుంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ గొప్ప అటగాడు అనడంలో సందేహం లేదు. కానీ, ట్రిక్కీ పిచ్లపై అతను చాలా నీచంగా ఔట్ అవుతాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ ఏ గ్రౌండైనా.. ఓ పరిస్థితుల్లో అయినా ఆడగలడు. అందుకే అతను టెస్ట్ క్రికెట్కి బాస్.
ఇండియా గ్రీన్ పిచ్లపై తరచూ ఆడదు.. విరాట్ కోహ్లీ గ్రీన్ ట్రాక్పై ఆడటం నేను ఎప్పుడూ చూడలేదు. అతను ఫ్లాట్ ట్రాక్లను మిస్ అవుతున్నాడు. మరోసారి విదేశాల్లో తనే ఉత్తమ క్రికెటర్ని అని నిరూపించుకున్న అజింక్యా రహానేకి అభినందనలు. ఈ పిచ్ని చూస్తుంటే టెస్ట్ క్రికెట్ బ్రతికే ఉందని అనిపిస్తుంది.
ఈ టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ తనకి అర్హత ఉన్న స్థానానికి వచ్చేస్తాడు.. అదే స్టీవ్ స్మిత్ వెనక్కి.
ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు విరాట్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, తొలి టెస్ట్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి.. భారత్ను బ్యాటింగ్కు అహ్వానించాడు. తొలి రోజు వర్షం కారణంగా ఆట ముగిసేసమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజ్లో అజింక్యా రహానే(38), రిషబ్ పంత్(10) ఉన్నారు.