మెట్రోలో.. నేలపై.. పసికందుతో మహిళ
ABN , First Publish Date - 2021-10-26T08:40:25+05:30 IST
రైలు బోగీ నిండుగా జనం.. ఒక్క సీటూ ఖాళీ లేదు..! చేతిలో పసికందు..! అయ్యో చంటిపాపతో ఉన్నదే అని.. ఆమె కోసం ప్రయాణికులెవరూ సీటును త్యాగం చేయలేదు..!
- సీట్లలో ఫోన్లు చూస్తూ యువతులు, మహిళలు
- ఇదేనా మానవత్వమంటూ సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రైలు బోగీ నిండుగా జనం.. ఒక్క సీటూ ఖాళీ లేదు..! చేతిలో పసికందు..! అయ్యో చంటిపాపతో ఉన్నదే అని.. ఆమె కోసం ప్రయాణికులెవరూ సీటును త్యాగం చేయలేదు..! అంతేకాదు మొబైల్ ఫోన్లు చూసుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ కనీసం పట్టించుకోలేదు. దీంతో.. విధిలేక ఓ మహిళ శిశువుతో బోగీలో నేలపై కూర్చుని ప్రయాణించిన దృశ్యాన్ని కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్లో చోటుచేసుకుందీ ఘటన. కాగా, సీట్లలోని వారంతా చదువుకున్నవారేనని కనిపిస్తుండడంతో ఇదేనా మానవత్వం అంటూ నెటిజన్లు మరింత మండిపడుతున్నారు. ఇతర రవాణా వాహనాల్లోలాగే మెట్రో రైళ్లలోనూ బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.