జగన్‌ పాలనలో మైనార్టీలపై అఘాయిత్యాలు

ABN , First Publish Date - 2022-05-15T08:27:47+05:30 IST

TDP Minority Cell‌

జగన్‌ పాలనలో మైనార్టీలపై అఘాయిత్యాలు

హసీనా కుటుంబంపై ఎమ్మెల్యే కాపు అనుచరుల దాడి 

అత్యాచారానికీ ప్రయత్నించారు:  టీడీపీ మైనార్టీ సెల్‌


అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. జగన్‌ పాలనలో మైనార్టీలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి’’ అని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండతో ఆయన అనుచరులు, వైసీపీ నేతలు కనేకల్‌ మండలం ఆలూరు మైనార్టీ వర్గానికి చెందిన హసీనా, ఆమె భర్త హుస్సేన్‌ బాషాలను నానా రకాలుగా హింసించారని ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకోకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. హసీనాను ఎమ్మెల్యే అనుచరులు మక్బూల్‌, ముక్దసిర్‌ దారుణంగా హింసించి, అత్యాచారానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ హసీనాతో తెల్లకాగితంపై సంతకం పెట్టించుకుని, తర్వాత ఎఫ్‌ఐఆర్‌ రాశారని చెప్పారు. ముగ్గురు ఆడపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామన్న హసీనా దంపతులకు ధైర్యం చెప్పి మీడియా ముందుకు తెచ్చామన్నారు. బాధితురాలు హసీనా మాట్లాడుతూ... మక్బూల్‌ బాషా, అతని కుమారుడు ముక్దసిర్‌ తనను దారుణంగా హింసించారని చెప్పారు. హసీనా భర్త హుస్సేన్‌ బాషా మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఉంటే ప్రాణాలతో మిగులుతామనే నమ్మకం లేక ఊరొదిలి వచ్చామని వాపోయారు.

Updated Date - 2022-05-15T08:27:47+05:30 IST