కరోనా అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-08-11T11:20:05+05:30 IST

కరోనా మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు.

కరోనా అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు

బంగారుపాళ్యం, ఆగస్టు 10: కరోనా మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో బంగారుపాళ్యంలో మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండల కేంద్రంలో నివసిస్తున్న విజయకుమార్‌ (50) వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఫలితాలు రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆయనకు శ్వాసకోశ సమస్య వచ్చింది. 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.


అనంతరం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మృతుడి బంధువుల సాయంతో కరిడివారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువులో అంత్యక్రియలకు గోతిని తీశారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా కరిడివారిపల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. బంగారుపాళ్యం సమీపంలో చేయకుండా ఇక్కడెలా అంత్యక్రియలు చేస్తారని ప్రశ్నించారు. చెరువులో ఖననం చేయడానికి వీలులేదని ఆందోళన చేపట్టారు. తహసీల్దార్‌ సీతారాం, ఎంపీడీవో విద్యారమ, సీఐ రామకృష్ణాచారి,  ఎస్‌ఐ రామకృష్ణలు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం మరోచోట మృతదేహాన్ని ఖననం చేయించారు. 

Updated Date - 2020-08-11T11:20:05+05:30 IST