బార్గా మారిన గ్రామ సచివాలయం!
ABN , First Publish Date - 2020-06-04T10:00:41+05:30 IST
గ్రామ స్వరాజ్యమే లక్ష్యమంటూ ప్రారంభమైన..
మద్యం సేవిస్తూ దొరికిపోయిన గ్రామ కార్యదర్శి
సోషల్ మీడియాలో హల్చల్
బెళుగుప్ప(అనంతపురం): గ్రామ స్వరాజ్యమే లక్ష్యమంటూ ప్రారంభమైన గ్రామ సచివాలయాలు క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. విద్యా, వైద్యం, సంక్షేమం తదితర సేవలందించాల్సిన కార్యాలయాలు బార్లుగా మారిపోతున్నాయి. బెళుగుప్ప మండలంలోని అంకంపల్లి గ్రామ సచివాలయం ఇందుకు తార్కాణంగా నిలిచింది. సాక్షాత్తూ గ్రామ కార్యదర్శి, కొందరు వైసీపీ నాయకులు కలసి మందు తాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంకంపల్లి గ్రామ కార్యదర్శి వెంకటేశులు విధులు ముగించుకుని రాత్రిపూట కార్యాలయంలోనే ఉంటూ మద్యం సేవిస్తున్న దృశ్యాలను కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఏది ఏమైనా సచివాలయంలోనే మద్యం సేవించడం ఎంతవరకు సమంజసమని కొందరు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామ కార్యదర్శితో పాటు స్థానిక వైసీపీ నాయకులు కూడా సచివాలయంలోనే ఉంటూ మద్యం సేవిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయమై గ్రామ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ తమకు అనుకూలంగా పనిచేయకపోవడంతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎంపీడీఓ ముస్తఫా కమల్బాషా మాట్లాడుతూ విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.