ఆస్ట్రేలియాలో వికారాబాద్ యువకుడి మృతి !
ABN , First Publish Date - 2020-09-22T16:41:26+05:30 IST
వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాసుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నాగారం హరిశివశంకర్రెడ్డి(25) ఆస్ట్రేలియాలో మృతిచెందాడు.
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాసుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నాగారం హరిశివశంకర్రెడ్డి(25) ఆస్ట్రేలియాలో మృతిచెందాడు. బాత్రూంలో కిందపడి మెదడులో నరాలు చిట్లి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడు. ఈ మేరకు అదే రోజు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆస్ట్రేలియా నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హరిదాసుపల్లి గ్రామానికి చెందిన రైతు నాగారం సాయిరెడ్డి, నాగేంద్రమ్మల కుమారుడు హరిశివశంకర్రెడ్డి హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ప్రస్తుతం ఆ దేశంలోని బ్రిస్బేన్ నగరంలోని సౌత్రన్ క్రాస్ యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
15న బ్రెయిన్ డెడ్...
హరిశివశంకర్రెడ్డి ఈ నెల 15న బాత్రూంలో కిందపడి మెదడు నరాలు చిట్లి బ్రెయిన్ డెడ్ అయి, స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం బ్రిస్బేన్ టౌన్లోని అలెగ్జాండ్రా ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.