Vijayawada: కలెక్టర్ను కలిసిన టీడీపీ నేతల బృందం
ABN , First Publish Date - 2021-07-30T16:39:24+05:30 IST
విజయవాడ కలెక్టర్ జే.నివాస్తో టీడీపీ నేతల బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు.
అమరావతి: విజయవాడ కలెక్టర్ జే.నివాస్తో టీడీపీ నేతల బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ కలెక్టర్కు నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ గుండాలు దాడి చేసి ఆయన పైనే రివర్స్ కేసులు పెట్టారన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్ను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్కు పంపారని మండిపడ్డారు. రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ చేయడం దారుణమన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్లో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అధికారులు చూస్తూ ఉండటం తగదన్నారు. అక్రమ మైనింగ్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు.
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి కొండపల్లి అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశానికి టీడీపీ సీనియర్ నేతలు వెళ్తున్నామని చెప్పారు. రెవిన్యూ, ఫారెస్ట్, మైనింగ్ మూడు శాఖల నుండి ముగ్గురు అధికారులను తమ వెంట పంపాలి అని కోరామన్నారు. తమ వెంట అధికారులు లేకపోతే ఎమ్మెల్యే వసంత రౌడి ఇజం చేస్తారని తెలిపారు. తాము అక్రమ మైనింగ్ పరిశీలించి చంద్రబాబుకు నివేదిక అందచేస్తామని చెప్పారు. కలెక్టర్ టీమ్ పంపిస్తే వారి వెంట వెళతామని...లేకపోతే తాము వెళతామని స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నుండి మొదలు పెట్టి వరుసగా అక్రమ అరెస్టులు చేస్తూ వస్తున్నారని అన్నారు.