ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న వరద
ABN , First Publish Date - 2020-09-27T19:11:07+05:30 IST
ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది.
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి గత నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మునేరు, వైరా, కటలేరు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 5లక్షల 10 వేల క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 5లక్షల 05వేలుగా ఉంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాల మేరకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో నాలుగు రోజుల ఇదే ప్రవాహం కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజానీకంతోపాటు లంక ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను చేపట్టారు. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల వద్ద ఉదృతంగా వరద నీరు* ప్రవహిస్తోంది. ముక్త్యాల - జగ్గయ్యపేట రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది.