సొంత పార్టీ నేతల ఆరోపణల నేపథ్యంలో కేశినేని సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-03-06T19:38:19+05:30 IST

పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చేస్తున్న ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.

సొంత పార్టీ నేతల ఆరోపణల నేపథ్యంలో కేశినేని సంచలన ప్రకటన

విజయవాడ:  సొంత పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చేస్తున్న ఆరోపణలపై విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. అసలు చంద్రబాబు రూట్ మ్యాప్ మార్పుతో తనకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కలిసి రూపొందించాయన్నారు. తన తీరు నచ్చకపోతే తనపై ఆరోపణలు చేసినవారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. విభేదాలు ఉన్నాయని వారుంటున్నారని, లేవని తానంటున్నానన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని తేల్చి చెప్పారు. విమర్శలను వారి విచక్షణకు వదిలేస్తున్నానన్నారు. 


పార్టీ కోసమే తాను కష్టపడుతున్నానని ఆయన చెప్పారు. విజయవాడ కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరాలన్నదే తన ధ్యేయమన్నారు. పార్టీ ఏది చెప్తే అది చేయటానికి తాను సిద్ధమని, తన దారిలో తాను వెళ్తుంటే తనకు తెలియని బాధలు కొందరికి ఉన్నాయేమోనని, ఆ విషయం తనకు తెలియదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కుందన్నారు. తన వెంట ఉన్నది, తాను ఆత్మ బంధువులుగా భావించేది బీసీలు, ముస్లిం మైనార్టీలేనని.. సీట్ల కేటాయింపులో తాను విభేదించింది కూడా బ్రాహ్మణ, బీసీ సీట్ల కోసమేనన్నారు. తాను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చేయొచ్చని, చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇస్తే వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. 

Updated Date - 2021-03-06T19:38:19+05:30 IST