సువర్ణశోభితం.. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మ దర్శనం
ABN , First Publish Date - 2020-10-18T15:36:28+05:30 IST
కనకప్రభలతో కొలువుదీరిన కనకదుర్గమ్మ సువర్ణకాంతులను ప్రసరించింది. బంగారు కవచాలను ధరించి శతకోటి సూర్యప్రభలతో అనుగ్రహించిన..
కొవిడ్ నిబంధనల కారణంగా పరిమితంగానే భక్తులు
తొలిరోజు 9,215 మంది రాక
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కనకప్రభలతో కొలువుదీరిన కనకదుర్గమ్మ సువర్ణకాంతులను ప్రసరించింది. బంగారు కవచాలను ధరించి శతకోటి సూర్యప్రభలతో అనుగ్రహించిన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కాగా, స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భక్తితో దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి వేదపండితులు అమ్మవారికి సుప్రభాతసేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చన నిర్వహించి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఆన్లైన్ టికెట్ ఉన్న వారినే దర్శనానికి అనుమతించారు. తొలిరోజు 9,215 మంది భక్తులు దుర్గమ్మను దర్శించు కున్నారు. పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఈవో ఎంవీ సురేష్బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు తొలిదర్శనం చేసుకున్న అనంతరం ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.
దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్కుమార్, జనసేన నేత పోతిన మహేశ్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంకాలం గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలోనే పల్లకీ సేవ నిర్వహించారు. మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో దంపతులు గణపతిపూజ నిర్వహించి అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. కుంకుమార్చన, సువాసినీ పూజలు వైభవంగా జరిగాయి. యాగశాలలో కలశస్థాపన, చండీయాగం ఘనంగా జరిగాయి. కాగా, ఆదివారం అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు.