బెజవాడ గ్యాంగ్‌వార్‌పై సీపీ చెప్పిన నిజానిజాలివీ..

ABN , First Publish Date - 2020-06-05T22:09:57+05:30 IST

బెజవాడలో ఒక్కసారిగా కలకలం రేపిన గ్యాంగ్‌వార్‌‌కు సంబంధించి

బెజవాడ గ్యాంగ్‌వార్‌పై సీపీ చెప్పిన నిజానిజాలివీ..

విజయవాడ : బెజవాడలో ఒక్కసారిగా కలకలం రేపిన గ్యాంగ్‌వార్‌‌కు సంబంధించి రోజురోజుకూ కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. అసలు సందీప్‌, పండుకు మధ్య వివాదాలు చంపుకొనే స్థాయికి ఎందుకు చేరాయి? అసలు ఒక్కసారిగా కత్తులు దూసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయ్..? అనే విషయాలపై ఈ గ్యాంగ్‌వార్‌లో తవ్వేకొద్దీ పగలు.. పంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఇప్పటికే 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వార్నింగ్..

తాజాగా విజయవాడ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ అసలేం జరిగింది..? ఘర్షణ ఎందుకు జరిగింది..? గొడవకు దారి తీసిన పరిస్థితులేంటి..? అనే విషయాలను నిశితంగా వెల్లడించారు. రౌడీలకు రౌడీలు కావాలనుకునేవారిని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నగరంలో ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. రోడ్లపై కొట్లాడే వాళ్లపై తీవ్ర చర్యలుంటాయ్ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. గ్యాంగ్ వార్‌లు, ఘర్షణలు పునరావృత్తమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.


నిజానిజాలివీ...

తోట సందీప్, పండు ఒకప్పుడు స్నేహితులు. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌ మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదమే ఘర్షణకు కారణం. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించాం. 13 మంది నిందితుల నుంచి కొబ్బరి బోండాల కత్తి, కోడి కత్తి, కట్టర్‌, ఫోల్డింగ్‌ బ్లేడ్‌, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నాం. మాట్లాడుకుందామని పిలిపించుకుని కళ్లలో కారం కొట్టుకుని ఘర్షణకు దిగారు. పోలీసులు వెళ్లేసరికి కొట్లాడు పూర్తయ్యింది. శ్రీధర్‌తో వివాదంలో బుట్టా నాగబాబును ప్రదీప్‌ ఆశ్రయించాడు. నాగబాబు, ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్, తోటా సందీప్, పండు కలుసుకున్నారు. తాను రాజీ చేయడానికి వచ్చిన సెటిల్‌మెంట్ విషయంలో నువ్వు ఎందుకు వచ్చావని పండుని ఫోన్‌లో సందీప్‌ నిలదీశాడు. అర్థరాత్రి అనుచరులతో వెళ్లి పండు తల్లితో సందీప్‌ గొడవపడ్డాడు. సందీప్‌ షాప్‌ వద్దకు వెళ్లి వర్కర్లపై పండు దాడి చేశాడు. విషయం తెలుసుకున్న సందీప్.. పండుకు ఫోన్ చేసి సవాల్‌ విసిరాడు. తోటావారి వీధిలో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. గ్యాంగ్‌వార్‌లో సందీప్‌ చనిపోయాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పండు చికిత్సపొందుతున్నాడు. యనమలకుదురులోని 7 సెంట్ల స్థలం విషయంలో గొడవ జరిగింది. నేను సెటిల్‌మెంట్‌ చేస్తుంటే నువ్వెందుకు వచ్చావని పండుని సందీప్‌ నిలదీశాడు. ఘర్షణలో స్టూడెంట్స్‌ ఎవరూ లేరు. ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. వీళ్లలో కొంతమందిని రాజకీయ వ్యక్తులు వాడుకున్నారు. సందీప్‌ మీద 13 కేసులు ఉన్నాయి, పండుపై 3 కేసులు ఉన్నాయి. 2016లో సందీప్‌ మీద ఉన్న రౌడీషీట్‌ని మూసివేశాం’ అని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-05T22:09:57+05:30 IST