ఒక్కసారైనా సీఎం జగన్ రైతులతో మాట్లాడారా?: పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-02-27T15:48:55+05:30 IST

అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది అని అమరావతి మహిళా జేఏసీ నేత, ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ అన్నారు.

ఒక్కసారైనా సీఎం జగన్ రైతులతో మాట్లాడారా?: పద్మశ్రీ

విజయవాడ: అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది అని అమరావతి మహిళా జేఏసీ నేత, ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ అన్నారు.  రాజధాని రైతుల ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి దారుణమని మండిపడ్డారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి పలు దఫాలుగా రైతులతో చర్చించారని.. మరి ఏపీలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి జగన్ రైతులతో మాట్లాడారా? అని ప్రశ్నించారు. రాజధాని కోసం ఒకవైపు అన్నదాతలు తనువు చాలిస్తున్నారన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు, మహిళలు 440 రోజుల తరబడి పోరాటం చేస్తున్నారని తెలిపారు. అమరావతి రాజధాని సమస్యకు ప్రభుత్వం ఒక పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలన్నారు. ఈ కమిటీలో సిట్టింగ్ జడ్జి, ఐఏఎస్ అధికారులతో పాటు రైతులంటే గౌరవం ఉన్న రాష్ట్ర మంత్రి సభ్యులుగా ఉండాలని చెప్పారు. అన్నదాత కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న సంగతి జగన్ గుర్తు పెట్టుకోవాలని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. 

Updated Date - 2021-02-27T15:48:55+05:30 IST