ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ను పట్టించుకోరా?: విజయశాంతి
ABN , First Publish Date - 2022-06-16T03:15:14+05:30 IST
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఎస్సారెస్పీకి 610 టీఎంసీల ఇన్ఫ్లోగా రాగా.. అధికారుల
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఎస్సారెస్పీకి 610 టీఎంసీల ఇన్ఫ్లోగా రాగా.. అధికారుల సమన్వయ లోపం వల్ల నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇంకా ఏమన్నారంటే..
‘‘కేసీఆర్ తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటారు. కానీ అది చేతల్లో కనిపించడం లేదు. తెలంగాణకు కాళేశ్వరమే సర్వరోగ నివారిణి అని చెబుతూ భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎస్సారెస్పీకి ఈసారి కూడా భారీగా జలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్ట్ గేట్లు గతేడాది మొరాయించి నీరు వృథాగా పోయింది. మరి ఈసారైనా గేట్లు సరిగా పనిచేస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015లో మాత్రమే ప్రాజెక్ట్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరింది. తర్వాత మళ్లీ ఆ పరిస్థితి రాలేదు. మూడేళ్లుగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్లో భారీగా వరదనీరు చేరడంతో ఆయకట్టుకు సాగునీటి కొరత ఏర్పడలేదు. 2020 జూన్ 30 వరకు ఎస్సారెస్పీలో 30 టీఎంసీలు ఉండగా... గతేడాది జూన్ 14, 2021 నాటికి 26.94 టీఎంసీలు ఉన్నాయి. ఈ సారి కూడా సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో 6.70 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎస్సారెస్సీలో మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. 90 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరగానే గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతారు. గతేడాది 610 టీఎంసీల ఇన్ ఫ్లో వచ్చింది. అధికారుల సమన్వయ లోపం వల్ల నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తాయి. 42 గేట్లలో 11 గేట్లు మొరాయించడంతో నీటి విడుదలలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో నీరు ఎక్కువ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున నీరు వృథా అయింది. దీంతో రెగ్యులర్ మరమ్మతుల ద్వారా వరద గేట్లకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 37 గేట్లు పనిచేసేలా మరమ్మతు పూర్తి చేశారు. మరో 5 గేట్లకు అధికారులు టెండర్లు పూర్తి చేశారు కానీ పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో వాటి మరమ్మతులు కష్టసాధ్యమేనని తెలుస్తోంది. కేసీఆర్ సారూ.... కమీషన్లు వచ్చే పనులే కాకుండా వీటిని కూడా పట్టించుకోండి. అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్ను త్వరలోనే తెలంగాణ రైతాంగం బంగాళాఖాతంలో కలపడం ఖాయం.’’ అని పేర్కొన్నారు.