లావణ్య మృతిపై Bjp రాజకీయం చేయలేదు
ABN , First Publish Date - 2022-02-03T14:41:05+05:30 IST
అరియలూరు విద్యార్థిని లావణ్యను ఆమె చదువుతున్న స్కూలు యాజమాన్యం మతమార్పిడికి నిర్బంధించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, బీజేపీ జాతీయ
- మాజీ ఎంపీ విజయశాంతి
ప్యారీస్(చెన్నై): అరియలూరు విద్యార్థిని లావణ్యను ఆమె చదువుతున్న స్కూలు యాజమాన్యం మతమార్పిడికి నిర్బంధించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. స్థానిక టి.నగర్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం కమలాలయంలో బుధవారం బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులు చిత్రారాయ్, ఎంపీ సంధ్యారాయ్, కర్ణాటక రాష్ట్ర బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గీతా వివేకానంద, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, రాష్ట్ర ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డితో కలిసి విజయశాంతి మీడియాతో మాట్లాడారు. లావణ్య మృతిని తమ పార్టీ రాజకీయ కోణంలో చూడలేదని, అయితే డీఎంకే ప్రభుత్వం ఒక మతాన్ని కాపాడాలనే దృష్టితో ఈ సంఘటనలోని వాస్తవాలను మరుగుపరచిందని ఆమె ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు తమ బృందం మంగళవారం లావణ్య కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించినట్టు తెలిపారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్, ఏడీఎస్పీలను కలిసి సీబీఐ దర్యాప్తుకు సహకరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. లావణ్య కుటుంబం డీఎంకే పార్టీకి చెందినదని, అయినప్పటికీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకే బీజేపీ ఈ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుందని విజయశాంతి స్పష్టం చేశారు.