అందుకే కాంగ్రెస్తో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు: విజయశాంతి
ABN , First Publish Date - 2022-02-15T00:26:37+05:30 IST
అందుకే కాంగ్రెస్తో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు: విజయశాంతి
హైదరాబాద్: మళ్లీ అధికారంలోకి రాలేమని తెలిసే కాంగ్రెస్తో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. బీజేపీ బలపడుతుంటే తట్టుకోలేక ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కంటే గొప్పగా రాహుల్ గాంధీపై సీఎం సానుభూతి చూపించారంటేనే... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోందని చెప్పారు. ప్రధాని మోదీపై సోనియా గాంధీ, చంద్రబాబు కామెంట్లు చేసినప్పుడు కేసీఆర్ కళ్లల్లో నీళ్లెందుకు రాలేదని రాములమ్మ ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై అకస్మాత్తుగా ప్రేమ రావడం అధికార దాహమేనన్నారు. భాష గురించి కేసీఆర్ మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విజయశాంతి ఎద్దేవా చేశారు. భైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని కేసీఆర్... మతరాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ హిందువులను బెదిరింపులకు గురి చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేకపోయారని విజయశాంతి ప్రశ్నించారు. ఓటమి భయంతో బీజేపీని విమర్శిస్తే... తెలంగాణ ప్రజలు నమ్మబోరని తెలిపారు. మోసపూరిత కేసీఆర్ సర్కార్కు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజానీకం తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని విజయశాంతి చెప్పారు.