కేసీఆర్ సర్కార్లో మంత్రి పేరుకు మాత్రమే: విజయశాంతి
ABN , First Publish Date - 2022-02-11T02:11:32+05:30 IST
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్లో మంత్రి పేరుకు మాత్రమేనని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్లో మంత్రి పేరుకు మాత్రమేనని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా స్పౌజ్ బదిలీలు చేస్తూ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. నిన్నటిదాకా స్పౌజ్ బదిలీలపై సర్కారు పెద్దలు కుంటి సాకులు చెప్పి... లోలోపల మాత్రం బ్లాక్ చేసిన జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలు కానిచ్చేశారని చెప్పారు. ఈ ఎవ్వారమంతా సీఎస్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫీసర్ల కనుసన్నలలో జరిగిందని ఆమె ఆరోపించారు. రెండు రోజుల కింద నేరుగా సెక్రటేరియట్ నుంచి 13 జిల్లాల కలెక్టర్లకు సుమారు 400 మందికి సంబంధించిన స్పౌజ్ ఆర్డర్లు వాట్సాప్ ద్వారా పంపిస్తే... వీటిని కలెక్టర్లు సోమవారం డీఈవోలకు పంపించగా... వారంతా అదే రోజు ఆ టీచర్లకు గుట్టు చప్పుడు కాకుండా పోస్టింగ్స్ ఇచ్చేశారని, ఈ తంతు కోసం భారీగా సొమ్ములు చేతులు మారాయని విజయశాంతి ఆరోపణలు చేశారు. దీనిపై టీచర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నా... కేసీఆర్ సర్కార్ మొద్దు నిద్రపోతోందన్నారు.